- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగం కల్పించే బాధ్యత నాది: CM రేవంత్ బంపర్ ఆఫర్
ప్రైవేటు మోజులో పడకుండా విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

దిశ, వెబ్డెస్క్: ప్రైవేటు మోజులో పడకుండా విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా రంగంలో మార్పులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితమిచ్చారు. తర్వాత జిల్లాలో రూ. 775 కోట్ల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతో మరికొన్ని కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు.
రూ. 2 వేల చొప్పున స్కాలర్ షిప్...
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. “రాష్ట్రంలో అత్యుత్తమ శిక్షణ పొందిన టీచర్లు లక్షకు పైగా పనిచేస్తున్నారు. 18 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ప్రారంభిస్తున్నాం. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రారంభించడమే కాకుండా విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రైవేటుకన్నా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి టీచర్లు ఉన్నారు. ప్రైవేటు మోజులో పడొద్దు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ఇంజినీరింగ్ పూర్తి చేస్తే ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదు. కానీ ఏటీసీ(అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు)ల్లో చదువుకుంటే ఉద్యోగం కల్పించే బాధ్యత నాది. సాంకేతిక నైపుణ్యం ఉండాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు ప్రతి నెల రూ. 2 వేల చొప్పున స్కాలర్ షిప్ ఇవ్వబోతున్నాం. విద్యార్థులు సొంత కాళ్లపై నిలబడాలి, ట్యాలెంట్ ఉంటే ప్రపంచం మనముందు తలవంచుకుని నిలబడుతుంది” అని అన్నారు.






