యుద్ధం జరుగుతున్నా అందాల పోటీలు నిర్వహించాం: సీఎం రేవంత్ రెడ్డి

by Naga Rani Yarlagadda |

ఇండియా- పాకిస్థాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్ లో ప్రపంచ సుందరీమణుల పోటీలు నిర్వహించామని.. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ దేశంలోనే సెఫెస్ట్ ప్లేస్ అని నిరూపితమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

యుద్ధం జరుగుతున్నా అందాల పోటీలు నిర్వహించాం: సీఎం రేవంత్ రెడ్డి
X
  • శాంతి భద్రతలకు తెలంగాణ సేఫెస్ట్ ప్లేస్
  • గత ప్రభుత్వం టూరిజాన్ని పట్టించుకోలేదు
  • హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతాం
  • పర్యాటక రంగానికి రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులు
  • టూరిజం కాంక్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: ఇండియా- పాకిస్థాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్ లో ప్రపంచ సుందరీమణుల పోటీలు నిర్వహించామని.. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ దేశంలోనే సెఫెస్ట్ ప్లేస్ అని నిరూపితమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు రక్షణ ఉంటుందని.. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం శిల్పారామంలో "టూరిజం కాన్​క్లేవ్-2025​" కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టూరిజం కాంక్లేవ్‌లో తెలంగాణకు మొత్తం 30 ప్రాజెక్టుల ద్వారా రూ.15,279 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 50 వేల మందికి ఉపాధికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా టూరిజం ఎక్సలెన్స్-2025 అవార్డులను అందచేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయం, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, చౌమహల్లా ప్యాలెస్, ఏఐజీ హాస్పిటల్, ఎక్స్ పీరియం, తాజ్ కృష్ణా, ద లీలా, కన్హా శాంతివనం, సాలర్ జంగ్ మ్యూజియం మొదలైన వాటికి అవార్డులు అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా టూరిజంకు ఒక పాలసీ లేదని... తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక పాలసీ తీసుకువచ్చామని తెలిపారు. పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఈ సందర్భంగా సీఎం అభినందించారు. తెలంగాణలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని... పర్యాటక రంగానికి ఎంతో స్కోప్ ఉన్న రాష్ట్రమని తెలిపారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజినల్ సిటీ అని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడుతుందున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి... లాభాలు పొందాలని పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. ఎకో, మెడికల్, టెంపుల్ టూరిజంను ప్రోత్సహిస్తామని తెలిపారు.

Next Story