మొంథా తుపాను ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా

by Prasad Jukanti |

కళ్లాల్లో ఆరబోసిన ధాన్యానికి నష్టం జరగకుండా చూడాలిష్టం జరగకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.

మొంథా తుపాను ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మొంథా తుపాను (Montha cyclone) ప్రభావంపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను బుధవారం ఆరా తీశారు. వ‌రి కోత‌ల స‌మ‌యం కావ‌డం, ప‌లుచోట్ల క‌ళ్లాల్లో ధాన్యం ఉన్న నేపథ్యంలో రైతులకు ఎటువంటి న‌ష్టం వాటిల్లకుండా త‌గిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని ఆదేశించారు. ధాన్యం, ప‌త్తి కొనుగోలు కేంద్రాల్లో త‌గిన ఏర్పాట్లు చేయాల‌న్నారు. అన్ని శాఖ‌ల అధికారులు అప్రమత్తంగా ఉండాల‌ని సీఎం స్పష్టం చేశారు. మొంథా తుపాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో అధికంగా ఉండటం, హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్ లో గోల్కొండ ఎక్స్ ప్రెస్, గుండాతిమడుగు స్టేషన్ లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ లు నిలిచిపోవడం ప‌లు రైళ్లను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు దారి మ‌ళ్లించిన నేప‌థ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తీవ్ర ప్రభావం ఉన్నచోట ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపాలని, జిల్లా కలెక్టర్లు ఆయా బృందాల‌కు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్రజల నుంచి వ‌చ్చే విన‌తుల‌కు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాల‌ని సీఎం ఆదేశించారు.

వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోత‌ట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. నీటి పారుద‌ల శాఖ అధికారులు, సిబ్బంది రిజ‌ర్వాయ‌ర్లు, చెరువులు, కుంట‌ల నీటి మ‌ట్టాన్ని ఎప్పటికప్పుడు ప‌రిశీలిస్తూ నీటి విడుద‌ల‌పై ముందుగానే క‌లెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సీఎం సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవ‌ల్ బ్రిడ్జిలు, కాజ్‌వేల‌పై నుంచి రాక‌పోక‌లు పూర్తిగా నిషేధించాల‌న్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి స‌మీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ప‌ర్యవేక్షణ చేయాల‌ని సీఎం ఆదేశించారు.


తుపాను ప్రభావంతో వర్షపు నీరు నిల్వ కారణంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున న‌గ‌ర‌, పుర‌పాల‌క‌, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య ప‌నులు చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. వైద్యారోగ్య శాఖ త‌గినంత మందులు అందుబాటులో ఉంచుకోవాల‌ని... అవ‌స‌ర‌మైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప‌శు న‌ష్టం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని సీఎం సూచించారు. రెవెన్యూ, విద్యుత్‌, పంచాయ‌తీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్‌, అగ్నిమాప‌క శాఖ‌లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స‌మ‌న్వయంతో సాగాల‌ని సీఎం సూచించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్రజల నుంచి వ‌చ్చే విన‌తుల‌కు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాల‌ని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Next Story