CM Revanth Reddy : సింగపూర్ "గార్డెన్స్ బై ది బే" ను తలపించేలా మీరాలం బ్రిడ్జి: సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

మూసీ పునరుజ్జీవనం(Musi Revival)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

CM Revanth Reddy : సింగపూర్ గార్డెన్స్ బై ది బే ను తలపించేలా మీరాలం బ్రిడ్జి: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ :మూసీ పునరుజ్జీవనం(Musi Revival)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాపూ ఘాట్‌ వద్ద నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్‌(Gandhi Sarovar)తో పాటు మీర్ ఆలం ట్యాంక్‌(Meer Alam Tank)పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. మీర్ ఆలం ట్యాంక్‌పైన బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్‌లో టెండర్లు పిలవాలని, ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్‌ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

మీర్ ఆలం ట్యాంక్‌పై నిర్మించే బ్రిడ్జికి సంబంధించి కన్సెల్టెన్సీలు తయారు చేసిన నమూనా డిజైన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు. రెండున్నర కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని అద్భుతంగా, సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఉండే విధంగా డిజైన్లను ఎంచుకోవాలన్నారు. ఈ బ్రిడ్జితో పాటు మీర్ ఆలం ట్యాంక్‌లో వివిధ చోట్ల ఐలాండ్లు ఉన్న మూడు ప్రాంతాలను పర్యాటకులను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలని తెలిపారు. సింగపూర్‌లోని ‘గార్డెన్స్ బై ది బే’ ను తలపించేలా బర్డ్స్ పారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ మూడు ఐలాండ్లను అత్యంత సుందరంగా అభివృద్ధి చేయాలన్నారు.

వెడ్డింగ్ డెస్టినేషన్‌కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వంచర్ పార్క్, థీమ్ పార్క్, అంఫీ థియేటర్‌తో కూడిన డిజైన్లు ఉండాలని సూచించారు. బోటింగ్‌తో పాటు పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉండాలని, ట్యాంక్‌లో నీటిని శుద్ధి చేయటంతో పాటు ఐలాండ్‌ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేయాలన్నారు. పీపీపీ మోడల్లో ఈ ఐలాండ్ జోన్‌ను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేయాలని వెల్లడించారు. మీర్ అలం ట్యాంక్‌లో నీటి లభ్యతను, వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్రతను ముందుగానే అంచనా వేసుకొని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు చూపుతో డిజైన్లు రూపొందించాలిని, ఈ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలజీతో పాటు పర్యావరణానికి సంబంధించి నిపుణులు, లేదా ఆ రంగంలో పేరొందిన సంస్థలతో సర్వే చేయించి ఆ మేరకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.

మీర్ ఆలం బ్రిడ్జితో పాటు ఈ ఐలాండ్ జోన్‌ను పక్కనే ఉన్న జూ పార్కుకు అనుసంధానం చేయాలని, ఇక్కడి అభివృద్ధి ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని జూ పార్కును అప్‌గ్రేడ్ చేయాలని తెలియజేశారు. జూ అధికారులతో సంప్రదింపులు జరిపి, నిబంధనల ప్రకారం అప్‌గ్రేడ్ చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాస రాజు, మున్సిపల్ శాఖ, మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story