HYD: అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించిన CM రేవంత్

by Gantepaka Srikanth |

చార్మినార్‌(Charminar) సమీపంలోని గుల్జార్​హౌజ్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం(Gulzar Houz Fire Accident)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విచారణకు ఆదేశించారు.

HYD: అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించిన CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: చార్మినార్‌(Charminar) సమీపంలోని గుల్జార్​హౌజ్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం(Gulzar Houz Fire Accident)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి దారి తీసిన అసలైన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిలో 17 మంది మృతి చెందడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేయటంతో పాటు బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించేందుకు అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఐజీ నాగిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు.

అక్కడున్న బాధిత కుటుంబీకులతో ముఖ్యమంత్రి నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున తప్పకుండా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఫైర్​సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని, అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాయ స్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని ముఖ్యమంత్రి అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్​టీమ్​తమ శక్తి యుక్తులు ప్రదర్శించిందన్నారు.

Next Story