సమ్మక్క- సారలమ్మలకు ‘ఆన్‌లైన్‌’ మొక్కులు.. మనువడి పేరుతో నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం

by Disha Web Desk 14 |
సమ్మక్క- సారలమ్మలకు ‘ఆన్‌లైన్‌’ మొక్కులు.. మనువడి పేరుతో నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు ఆన్‌లైన్‌లో మొక్కులు చెల్లించే అవకాశాన్ని దేవదాయ శాఖ కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లోనే నిలువెత్తు ‘బంగారం’ (బెల్లం) సమర్పించే కార్యక్రమాన్ని ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తన మనవడు రియాన్ష్ నిలువెత్తు బంగారం ఆన్‌లైన్ ద్వారా సీఎం సమర్పించారు.

మరోవైపు తన మనవరాలి పేరుతో నిలువెత్తు బంగారం ఆన్‌లైన్ ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంగారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, సీఎస్ శాంతి కుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా, మేడారం జాతర ఆన్​లైన్ సేవలను దేవాదాయ శాఖ గత బుధవారం అందుబాటులోకి తెచ్చింది.

సమ్మక్క- సారలమ్మలకు ‘ఆన్‌లైన్‌’ మొక్కులు

మేడారానికి వెళ్లలేని భక్తులు సమ్మక్క సారక్కలకు బంగారం (బెల్లం) సమర్పించే అవకాశంతో పాటు ప్రసాదం తెప్పించుకునే సదుపాయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కల్పించింది. భక్తులు మీ సేవ, పోస్టాఫీసు, టీ యాప్ ఫోలియో యాప్ ద్వారా మొక్కులు చెల్లించుకోవచ్చు. భక్తులు వారి బరువుకి 1 కేజీకి రూ.60 చొప్పున చెల్లించి నిలువెత్తు బంగారం సమర్పణ సేవను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. నిలువెత్తు బంగారం సమర్పించేందుకు ఓ వ్యక్తి 50 కేజీలు ఉంటే.. బరువు ప్రకారం రూ.3000, మీ సేవ చార్జీలు రూ.35, పోస్టల్ చార్జీలు రూ.100 కలిసి మొత్తంగా రూ.3,135 చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించింది.

Next Story