మూసీ పరివాహక ప్రజలకు సీఎం రేవంత్ భరోసా.. శాసన మండలిలో కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

మూసీ ప్రక్షాళన వల్ల ఎవరికీ నష్టం కలగనివ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలి వేదిక స్పష్టం చేశారు. నిర్వాసితులకు మెరుగైన వసతులు కల్పిస్తామని, ప్రతిపక్షాలు రాజకీయాలు పక్కనపెట్టి సహకరించాలని కోరారు.

మూసీ పరివాహక ప్రజలకు సీఎం రేవంత్ భరోసా.. శాసన మండలిలో కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కాలుష్య నగరంగా మారకూడదనే ఉద్దేశంతోనే తాము ‘హిల్ట్’ (HILT) పాలసీని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ హైదరాబాద్ నగరాభివృద్ధిపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన (Musi Cleansing)తో పాటు నగరం అంతటా ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి భూమి కూడా ఎక్కువగా అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి అనేక సంస్కరణలు తీసుకువస్తున్న తమ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.

మూసీ ప్రక్షాళనకు ప్రతిపక్షాలు కలిసి రావాలి..

ప్రస్తుతం నగరంలో మూసీ ప్రక్షాళన అత్యవసరమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు. గుజరాత్‌ (Gujrat)లో సబర్మతి నది ప్రక్షాళనకు కాంగ్రెస్ సహకరించిందని గుర్తు చేస్తూ.. హైదరాబాద్‌ (Hyderabad)లో మూసీ ప్రక్షాళనకు రాజకీయ రంగు ఎందుకని ఆయన ప్రశ్నించారు. అడ్డుకోవడం పక్కన పెట్టి, ఏవైనా మంచి సలహాలు ఇస్తే కచ్చితంగా స్వీకరిస్తామని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూసీ వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు చూసిన వారెవరూ ఈ ప్రక్షాళనను అడ్డుకోరని పేర్కొన్నారు. ఒకవేళ నేరుగా చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే మంత్రులతో ఒక కమిటీ వేస్తానని, వారికైనా తమ సూచనలు తెలియజేయాలని కోరారు.

మూసీ పరివాహక ప్రాంత వాసులకు భరోసా..

మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులవుతున్న ప్రతి ఒక్కరినీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని, బాధితులందరికీ మెరుగైన ఆశ్రయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసిత మహిళలు వ్యాపారం చేసుకోవడానికి అవసరమైన సహకారం కూడా అందిస్తామని తెలిపారు. ‘ఏ ఒక్కరికీ నష్టం కలిగించం, అందరికీ మెరుగైన వసతులు కల్పిస్తాం. ప్రతిపక్షాల ట్రాప్‌లో పడి ఆందోళన చెందవద్దు’ అని సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలి వేదికగా ప్రకటించారు.

Next Story