జూనియర్ పంచాయతీ కార్యదర్శలకు సీఎం కేసీఆర్ శుభవార్త

by Disha Web Desk 2 |
జూనియర్ పంచాయతీ కార్యదర్శలకు సీఎం కేసీఆర్ శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: తమను రెగ్యులరైజ్ చేయాలని గతకొన్ని రోజుల క్రితం ఆందోళనలు చేసి విరమించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. జేపీఎస్‌లు అందరినీ క్రమబద్దీకరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును సమీక్ష చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సూచించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ మెంబర్లుగా ఉండనున్నారు.

దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడీ స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయనున్నారు. జిల్లా స్థాయి కమిటీ ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీ చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది. కాగా, రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, సీఎం ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ శాంతి కుమారి, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read..

MLA టికెట్ల కేటాయింపుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు



Next Story

Most Viewed