పనులన్నీ ఏకకాలంలో పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

by Disha Web Desk 13 |
పనులన్నీ ఏకకాలంలో పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏకకాలంలో అన్ని పనులు వేగంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా సెక్రటేరియట్ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌లోని అన్ని విభాగాల పనులను అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. నిర్మిస్తున్న సచివాలయం నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. నిర్మాణాలన్నింటినీ సీఎం కలియతిరుగుతూ నిశితంగా పరిశీలించారు. తొలుత నిర్దేశించుకున్న డిజైన్ల ప్రకారం పనులు జరుగుతున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కావద్దని సూచించారు.


స్లాబ్‌ల నిర్మాణం, భవనం పైన డూమ్స్ ఏర్పాటు, ఇంటీరియర్ పనులతోపాటు ఫర్నీచర్ విషయంలో నూతన మోడల్స్ ఎంపిక చేసుకోవాలన్నారు. మంత్రుల ఛాంబర్లు, మీటింగ్ హాల్స్, యాంటీ రూమ్స్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భవనం మధ్య భాగంలో సుమారు 2 ఎకరాల ఖాళీ స్థలం తో పాటు, సెక్రటేరియట్ ప్రాంగణంలో గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ పనులు అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. గ్రిల్స్ నిర్మాణ పనుల నాణ్యత పై ఆరా తీశారు. రెడ్ స్టోన్, డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు.


విజిటర్స్ లాంజ్ నిర్మాణం, సెక్రటేరియట్ వాల్ వెంబడి మట్టి ఫిల్లింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సెక్రటేరియట్‌కు వచ్చే విదేశీ ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు సౌకర్యవంతంగా ఉండేలా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. మంత్రులు, సెక్రటరీలు, ఆయా శాఖల సిబ్బంది సౌకర్యవంతంగా పనులు చేసుకునేందుకు వీలుగా ఛాంబర్ల నిర్మాణం చేపట్టాలన్నారు. పనులు జరుగుతున్న తీరుపై సీఎం సమీక్షించారు.


పనులకు సంబంధించిన ఆల్బమ్‌ను పరిశీలిస్తూ.. ఒక్కో పని గురించి సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, బేతి సుభాష్ రెడ్డి, ఎ.జీవన్ రెడ్డి, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్, హైదరాబాద్ సీపీ సీ.వీ. ఆనంద్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed