రూ. 2వేల నోట్ల రద్దుపై సీఎం కేసీఆర్ రియాక్షన్ ఇదే..!

by Disha Web Desk 19 |
రూ. 2వేల నోట్ల రద్దుపై సీఎం కేసీఆర్ రియాక్షన్ ఇదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు చేసిన ప్రకటనపై కేసీఆర్ మౌనం వహించారు. అదే 2016లో పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయానికి కేసీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నిర్ణయంతో నల్లధనం నియంత్రించడానికి వెసులుబాటు లభిస్తుందని, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపైనా తాను ప్రధానికి స్వయంగా కొన్ని సూచనలు చేసినట్లు కేసీఆర్ అప్పట్లో పేర్కొన్నారు. 2016 డిసెంబరు 16న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నోట్ల రద్దు నిర్ణయంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.

‘కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే పాలసీ ప్రకారం ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. అనాలోచితం అని వ్యాఖ్యానించే అధికారం అసెంబ్లీకి లేదు.. ప్రధానిని విమర్శించడం సభ గౌరవానికి, సంప్రదాయాలకు భంగం కలిగిస్తుంది.. దయచేసి ఎవరూ పాలసీని విమర్శించే దిశగా లేదా కేంద్రాన్ని విమర్శించే దిశగా చర్చించకూడదు” అని స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు రూ. 2వేల నోటు ఉపంసహరణపై సైలెంట్‌గా ఉండిపోయారు. బీజేపీ విధానాలు, ప్రధాని మోడీ పరిపాలనా తీరును తీవ్రంగా ఖండిస్తూ యాంటీ-బీజేపీ పొలిటికల్ ఫైట్‌ను చేపట్టిన కేసీఆర్ ఆర్బీఐ తాజా నిర్ణయం పట్ల స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయించిందని, ప్రధాని మోడీ సూచనల మేరకే జరిగిందని విపక్షాలు విమర్శించాయి. కానీ కేసీఆర్ మాత్రం ఎలాంటి కామెంట్ చేయడానికి సుముఖంగా లేకపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. నాడు పెద్ద నోట్ల రద్దును సమర్ధించినట్లుగానే ఇప్పుడు రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకోడానికీ మద్దతు పలుకుతున్నట్లేనా అనే చర్చ మొదలైంది.

Read more:

ట్రెండ్ సెట్టర్ 'మోసగాళ్లకు మోసగాడు' రీ రిలీజ్ ఎప్పుడంటే?


Next Story

Most Viewed