మునుగోడు బైపోల్ తర్వాత CM KCRలో మార్పు!

by Disha Web Desk 2 |
మునుగోడు బైపోల్ తర్వాత CM KCRలో మార్పు!
X

సీఎం కేసీఆర్ వ్యవహారశైలీలో మార్పు కన్పిస్తుందా? ఆయన పనితీరు గతంకంటే భిన్నంగా ఉందా? ఇంతకాలం ఆయన తన చుట్టూ గీసుకున్న గీతను దాటి బయటకు వచ్చారా? అడిగిన వెంటనే ఎమ్మెల్యేలు, లీడర్లకు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారా? ఎదుటి వ్యక్తులు చెప్పే విషయాలను కూల్‌గా వింటున్నారా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. సీఎం ఎందుకు మారిపోయారు? మరి దీని వెనుక ఉన్న కారణాలేంటి?

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు బైపోల్ తర్వాత సీఎం తీరు చాలా వరకు మారిందని అంటున్న బీఆర్ఎకస్ లీడర్లు. బైపోల్‌కు ముందు సీఎం కేసీఆర్ ఎక్కువ టైమ్ ఫామ్ హౌజ్ లోనే గడిపే‌వారు. వారంలో కేవలం ఒకటి, రెండు రోజులు మాత్రమే ప్రగతిభవన్‌కు వచ్చేవారు. కొన్ని సార్లు హైదరాబాద్‌కు రాకుండా వారాల తరబడి ఫాంహౌస్ లోనే ఉన్న సందర్భాలూ ఉన్నాయి. అక్కడి నుంచే అన్ని వ్యవహారాలను చక్కదిద్దేవారు. మంత్రులు, సెక్రటరీలు, సీఎస్‌ను సైతం అక్కడికే పిలిచి రివ్యూలు నిర్వహించిన సందర్భాలూ లేకపోలేదు. ఆయన్ను కలవాలంటే అదో పెద్ద చాలెంజ్ గా ఉండేది. రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఆయన తీరులో మార్పు వచ్చింది. సీఎం ఎక్కువగా ప్రగతిభవన్‌లోనే ఉంటున్నారు. అడిగిన వెంటనే ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు. మునుగోడు బై‌పోల్ తర్వాత ఆయన రెండు, మూడు సార్ల కంటే ఎక్కవగా ఫాంహౌస్‌కు వెళ్లలేదని అంటున్నారు ఆ పార్టీ లీడర్లు. కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్.. ప్రగతిభవన్ లోనే ఉంటున్నారని, ఎప్పుడు వెళ్లినా కలుస్తున్నారని దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి వివరించారు. కొంత సమయం కేటాయించి మాట్లాడుతున్నారని తెలిపారు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతి ఒక్క లీడర్‌ను కలిశారు. వారితో ఫొటోలు దిగారు.

ప్రగతిభవన్‌కు ఎమ్మెల్యేల తాకిడి

ప్రగతిభవన్‌కు వెళ్లాలంటే గతంలో ఎమ్మెల్యేలు వెనకడుగు వేసేవారు. అపాయింట్‌మెంట్ లేకుంటే సెక్యూరిటీ స్టాఫ్ లోనికి రానిచ్చేవారు కాదు. ఇక తమ సెగ్మెంట్ లోని సమస్యల పరిష్కారం కోసం ఆ జిల్లా మంత్రి లేదా సంబంధిత శాఖ మంత్రిని కలిసి వినతిపత్రాలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు సైతం సీఎం అపాయింట్‌మెంట్ ఇస్తుండటంతో వారు ప్రగతిభవన్‌కు పరుగులు పెడుతున్నారు. సీఎం‌ను కలిసి తమ నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. వాటిపై స్పందిస్తున్న సీఎం సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నట్టు ఈ మధ్య ఆయన్ను కలిసి కొందరు ఎమ్మెల్యేలు తమ అనుభవాలను వివరించారు.

ప్రధాని ప్రోగ్రామ్‌కు డుమ్మా.. రాష్ట్రపతికి వెల్‌కమ్?

కేంద్ర ప్రభుత్వంతో వైరం మొదలైనప్పటి నుంచి ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారీ కేసీఆర్ స్వాగతం పలకలేదు. మంత్రి తలసానికి ప్రొటోకాల్ బాధ్యతలు అప్పగిస్తూ వస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాను రాష్ట్రానికి పిలిచి మద్దతు పలికారు. అనంతరం బీజేపీ అభ్యర్థి ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఆమెకు శుభాకాంక్షలు తెలుపలేదు. ఢిల్లీకి వెళ్లానా ఆమెను మర్యాదపూర్వకంగానైనా కలిసే ప్రయత్నించలేదు. కానీ ఈ నెల 26న శీతకాల విడిది కోసం రాష్ట్రపతి.. హైదారాబాద్‌కు వస్తుండటంతో ప్రొటోకాల్ ప్రకారం అమెకు సీఎం కేసీఆర్ స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఆమె టూర్ ముగించుకుని ఢిల్లీకి వెళ్లే సమయంలోనూ వీడ్కోలు పలికేందుకు రెడీ అయ్యారని టాక్.

రాజ్‌భవన్‌కు?

కేంద్రంతో విభేదాలు మొదలయ్యాక ఒక సారి మినహా.. రాజ్‌భవన్‌లోకి సీఎం కేసీఆర్ అడుగుపెట్టలేదు. కేంద్రం విభేదాల్లో గవర్నర్‌ను సైతం ఇన్‌వాల్వ్ చేశారు గులాబీ నేతలు. ఆమెపై పలు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ సంతకం చేయకపోవడంతో రాజ్‌భవన్ ఎదుట ఆందోళన చేయించేందుకు బీఆర్ఎస్ లీడర్లు ప్లాన్ చేసినట్టు విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గవర్నర్ ప్రమేయం ఉందని సోషల్ మీడియాలో పోస్టులు సైతం వైరల్ అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఈనెల 26న గవర్నర్ ఇస్తున్న విందు (ఎట్‌ హోం)కు సీఎం కేసీఆర్ వెళ్లేందుకు సిద్ధమైనట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Also Read..

నోరుజారిన కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ (వీడియో)

Next Story