‘తెలంగాణ ఒక్కరి వల్ల రాలేదు.. రాష్ట్ర గౌరవాన్ని దేశమంతా చాటుతాం’

by Disha Web Desk 2 |
‘తెలంగాణ ఒక్కరి వల్ల రాలేదు.. రాష్ట్ర గౌరవాన్ని దేశమంతా చాటుతాం’
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం ఏ ఒక్కరి వల్ల రాలేదని, 1200 మంది ఆత్మ బలిదానం, సకలజనుల పోరాటంతోనే తెలంగాణ సాధ్యమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఢిల్లీలో నిర్వహించామని, ఈసారి గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో పాటు.. సాయుధ బలగాల పరేడ్ జరగనుందని చెప్పారు. అనంతరం శంకర్ మహదేవన్, డాక్టర్ ఆనంద శంకర్ బృందం, మంజులా రామస్వామి బృందాల ప్రదర్శనలు ఉంటుందన్నారు. తెలంగాణ నేపథ్యాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

పాఠశాల విద్యార్థుల కోసం ‘ఖిలా ఔర్ కహానీ’ థీమ్‌తో పెయింటింగ్, ఫొటో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరూ ఈ వేడకకు హాజరవుతారని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పోషించిన పాత్రను తెలిపేలా ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. అలాగే ప్రధాని మోడీ తొమ్మిదేండ్ల పాలనకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్ సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన పార్టీ బీజేపీయేనని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా తాను స్వయంగా ఢిల్లీ వేదికగా రెండుసార్లు నిరసన దీక్ష చేసినట్లు గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ తమపై రెండుసార్లు లాఠీ చార్జీ చేయించిందన్నారు. తెలంగాణ గౌరవాన్ని పెంచేలా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశవ్యాప్తంగా మొదటిసారి అన్ని రాష్ట్రాల రాజ్ భవన్లలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర గౌరవాన్ని దేశమంతా చాటుతామన్నారు. గతేడాది సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.

రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు అంగీకారం

తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు బీజం పడింది. రెండు రాష్ట్రాల్లో రవాణా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం-విజయవాడ-తెలంగాణలోని శంషాబాద్ మధ్యలో మొదటి ప్రాజెక్టు కాగా విశాఖపట్నం-విజయవాడ-కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్ కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలుపుతూ.. దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే అయిన తర్వాత ప్రాజెక్టుపై ముందుడుగు పడనుంది. ఈ రైల్వే లైన్లకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో ముందడుగుపడింది. పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ ను కలిసి లేఖలు సమర్పించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రెండు రైల్వే లైన్లలో గరిష్టంగా 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ సర్వేను 6 నెలల్లో పూర్తిచేయనున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వై-ఫై, రూ.30వేల కోట్ల విలువైన డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను కేంద్రం తెలుగు రాష్ట్రాలకు అందించింది. వీటికి అదనంగా తెలంగాణలో వ్యాగన్ తయారీ, ఓవర్‌ హాలింగ్ కేంద్రాన్ని, ఎంఎంటీఎస్ రెండోదశ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, చర్లపల్లి టర్మినల్ వంటి ప్రాజెక్టులను కేంద్రం చేపడుతున్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed