అలా చేస్తే తప్ప కేసీఆర్‌ను ఓడించలేము: మురళీధర్ రావు

by Mahesh |
అలా చేస్తే తప్ప కేసీఆర్‌ను ఓడించలేము: మురళీధర్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : వెల్ఫేర్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను దెబ్బ కొట్టడం కష్టమని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్‌ఛార్జ్ మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. సంక్షేమం విషయంలో ముందు వరుసలో సీఎం కేసీఆర్ ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. కానీ కేవలం సంక్షేమం అస్త్రాన్నే వినియోగించుకుని ప్రతిసారి గెలవలేరని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేసీఆర్ ఎలాగో.. మధ్యప్రదేశ్ లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అలా అని మురళీధర్ రావు చెప్పుకొచ్చారు. వెల్ఫేర్ విషయంలో శివరాజ్ సైతం కాంగ్రెస్ కంటే ఒకడుగు ముందే ఉన్నారన్నారు. కేసీఆర్ ను కొట్టాలంటే.. ఆయన ఇచ్చిన హామీలు, వాటి అమలు విషయంలో ఇరకాటంలో పెట్టాలని, ఆ తేడాను ఇష్యూగా మలిచి ప్రజలకు వివరించి దెబ్బతీయాలని చెప్పారు. లేదంటే కేఆర్‌ను ఓడించలేమని చెప్పుకొచ్చారు.

కేసీఆర్‌ను కొట్టలేం అనేది కూడా పిచ్చి ముచ్చట అని, ఎందుకంటే తెలంగాణలో యూత్ చాలా ఎక్కువగా ఉన్నారని, దాదాపు 65 శాతం మంది ఉంటారన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య, పేపర్ లీకేజీ సమస్యలు వెంటాడున్నాయని, యూత్ కు అండగా ఉంటే ఈజీగా కేసీఆర్ ను కొట్టొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో గేమ్ చేంజర్లుగా యూత్ ఉంటారన్నారు. బీఆర్ఎస్‌ను ఓడించాలని వాళ్ళు డిసైడ్ అయితే, వారి ఓట్లు ఎవరికి పడితే వాళ్లదే అధికారమని ఆయన తెలిపారు. ఇక అవినీతి చేసినవాళ్లు ఎవరైనా జైలుకు రావాల్సిందేనని ఆయన కవిత పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అందుకే జైళ్లు కడుతున్నామని బండి చెప్పారన్నారు. పార్టీ అధ్యక్షుడి మార్పు కారణంగా పార్టీ డ్యామేజ్ అయిందనడం కరెక్ట్ కాదని, బండిని ఎందుకు మార్చారనేది మార్చిన వాళ్లకు బాగా తెలుసన్నారు.

నేతలను కలుపుకుపోవడం ఇబ్బందికరమని పార్టీ భావించి బండిని తప్పించింది కావచ్చేమోనని మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు తక్కువ టైం ఉన్న నేపథ్యంలో కొన్ని పెద్ద తలలు వస్తాయి కాబట్టి వారిని కలుపుకుపోవడంలో ఇబ్బందులు తలెత్తొచ్చనే భావించి తప్పించారేమోనని చెప్పారు. ఇకపోతే తెలంగాణలో పాలన పక్కన పెట్టి కేసీఆర్ అసలు బీఆర్ఎస్ ఎందుకు పెట్టాడని మురళీధర్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో ఆయన ఫెయిల్ అవుతున్నాడు కాబట్టే.. ఏదో ఒకటి చేయాలని జాతీయ పార్టీ అని కబుర్లు చెప్పారన్నారు. ఇక మధ్యప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ తప్పితే మరో పార్టీ లేదని, కాంగ్రెస్ నుంచి అసంతృప్తి నేతలు బీజేపీలో, బీజేపీ అసంతృప్తి నేతలుంటే కాంగ్రెస్ లో చేరడం తప్పితే మరో ఆల్టర్నేట్ గా ఇతర పార్టీలు లేవన్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ కు చాలా వ్యత్యాసం ఉందన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందన్నారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చినంత గట్టి పోటీ తెలంగాణ, మధ్య ప్రదేశ్ లో ఇవ్వలేకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటక లో లాగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ హామీలు ఇచ్చినా వారిని ప్రజలు నమ్మబోరని ధీమా వ్యక్తంచేశారు.

Next Story

Most Viewed