రెవెన్యూ సదస్సులతో పరిష్కారం దొరికేనా.?

by Ajay Maddhiboyina |

భూ సమస్యలను పరిష్కరిస్తామంటూ ధరణి స్థానంలో భూ భారతిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఫైలెట్ ప్రాజెక్టు పేరిట రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.

రెవెన్యూ సదస్సులతో పరిష్కారం దొరికేనా.?
X

దిశ, మేడ్చల్ బ్యూరో : భూ సమస్యలను పరిష్కరిస్తామంటూ ధరణి స్థానంలో భూ భారతిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఫైలెట్ ప్రాజెక్టు పేరిట రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ క్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో ఫైలెట్ ప్రాజెక్టులో భాగంగా అర్జిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వాటిని పరిష్కరించకుండానే ఇప్పుడు జూన్ 3 నుంచి రెవెన్యూ సదస్సులు అంటూ జిల్లా యంత్రాంగం ప్రకటించడంపై భూ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెయ్యికి పైగా దరఖాస్తులు వస్తే..

భూభారతి చట్టం అమలులో భాగంగా తొలుత కీసరలో సదస్సును నిర్వహించారు. కొత్త చట్టంతో తమ భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పలువురు ఫైలట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో దరఖాస్తులు అందజేశారు. ఇక్కడ నిర్వహించిన ప్రాజెక్టులో ఒక వెయ్యి 58 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. కానీ ఇప్పటి వరకు వాటిలో కేవలం 406 దరఖాస్తులు మాత్రమే డిస్పోస్ చేశారు.

ప్రొసీడింగ్ ఆర్డర్లు ఏవి..?

వెయ్యికి పైగా వచ్చిన దరఖాస్తులలో అధికారులు 406 దరఖాస్తులను పరిష్కరించాం అని ఆయా దరఖాస్తుదారులకు మెసేజులు పంపించినప్పటికీ వీటిలో చాలా వాటికి సంబంధిత ప్రొసీడింగ్ ఆర్డర్లు మాత్రం ఇప్పటివరకు అందలేదని తెలిసింది. అదేవిధంగా మిగిలిన దరఖాస్తుల స్థితి ఏంటి అనే సమాచారం లేదని ఆయా దరఖాస్తుదారులు తెలిపారు. తామిచ్చిన దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందా..? లేదా అనే అంశంపై క్లారిటీ లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 406 దరఖాస్తులను డిస్పోస్ చేశామని చెప్పిన అధికారులు వాటిపై కూడా పూర్తిస్థాయిలో పనిచేయలేదని ఆరోపిస్తున్నారు.

కేవలం ప్రచారం కోసమేనా..?

ఫైలెట్ ప్రాజెక్టులో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కారం చేసి అది సక్సెస్ అయిందని భావించిన తర్వాతనే ఇతర ప్రాంతాల్లో సదస్సులను నిర్వహించాలని చెబుతున్నారు. అదేం లేకుండానే ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది కదా.. సదస్సులను ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించేసి ఫొటోలు, వీడియోలు తీసుకొని ఉన్నత అధికారులకు పంపించుకుని మామ అనిపించుకునే విధంగా అధికారుల తీరు ఉండబోతుందని పలువురు విమర్శిస్తున్నారు. కేవలం ప్రచారం కోసం మాత్రమే సదస్సులను నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై నిర్వహించే రెవెన్యూ సదస్సులలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేసే దరఖాస్తులను పరిశీలించి సమస్యను తీర్చాలని కోరుతున్నారు.

జూన్ 3 నుంచి..

ఇక జూన్ 3 నుంచి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలను మేడ్చల్, శామీర్‌పేట్, ఘట్కేసర్, మూడుచింతలపల్లి, గండిమైసమ్మ దుండిగల్ మండలాలలోని గ్రామాల వారిగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ గౌతమ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా గ్రామ ప్రజలు భూ సమస్యలు ఉన్నట్లయితే రెవెన్యూ సదుస్సులలో అర్జీలను అందించాలని తెలిపారు.

Next Story