TSPSC సభ్యులు.. సీఎం అనుచరులే: RS ప్రవీణ్ కుమార్

by Disha Web Desk 2 |
TSPSC సభ్యులు.. సీఎం అనుచరులే: RS ప్రవీణ్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ సభ్యులంతా మెజారిటీగా సీఎం అనుచరులేనని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను కలిసి మాట్లాడారు. తాను చెప్పేవరకు కమిషన్‌లో పనిచేస్తూ పరీక్ష రాసిన సురేష్, షమీమ్, రమేష్ నిందితులను అరెస్టు చేయలేదన్నారు. ప్రశ్నప్రతాల లీకేజీ హనీట్రాప్, హ్యాకింగ్ అంటూ పక్కదోవ పట్టించే కుట్ర చేశారని, పది మంది టాప్ మార్కులు తెచ్చుకున్నారని ఆరోపించారు. దొంగలంతా కమిషన్ ఆఫీసులోనే ఉన్నారని విమర్శించారు. నిందితుడు ప్రవీణ్ ఓఎంఆర్ షీట్ మార్చింది అధికారులేనని ఆరోపించారు.

అమెరికా నుంచి వచ్చి రాసిన వారు కూడా టాప్ మార్కులు తెచ్చుకున్నారని అన్నారు. చైర్మన్ జనార్దన్ రెడ్డికి తెలియకుండా ప్రశ్నాపత్రాలు బయటకు ఎలా పోయాయని ప్రశ్నించారు. జనార్దన్ రెడ్డిని కాపాడుతున్నారని, ఎందుకంటే ఆయన నోరు తెరిస్తే దొంగలు బయట పడుతారని చెప్పారు. సీఎంవోలో ఏం కుట్రలు జరుగుతున్నాయో విద్యార్థులకు తెలియడం లేదన్నారు. తప్పు జరిగినప్పుడు కమిషన్ పెద్దలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. జనార్దన్ రెడ్డి, బోర్డు సభ్యులకు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. 2016 గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో కూడా అవినీతి జరిగిందని, ఇందులో జాగృతి నాయకులు పాసయ్యారని ఆరోపించారు. దానిపై కూడా సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేవరకు పోరాడుదమని పిలుపునిచ్చారు.



Next Story