ఉద్యోగులపై ప్రభుత్వం ‘కనిపించని’ చిత్రహింసలు!

by Disha Web Desk 2 |
ఉద్యోగులపై ప్రభుత్వం ‘కనిపించని’ చిత్రహింసలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బహుజన ఉద్యోగ సమాజంపై తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ‘కనిపించని’ చిత్రహింసలపై మాట్లాడాలంటే రోజులు చాలవని, దీనిపై నేను బహిరంగ చర్చకు సిద్ధమని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ మంత్రులు డేట్, టైం ఫిక్స్ చేస్తే ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర చర్చకు తాను సిద్ధమని ఛాలెంజ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సుపరిపాలన గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తున్నదని విమర్శించారు. ‘‘సీఎం రెగ్యులర్‌గా ఆఫీసుకు రాకపోవడం, వేల ఫైళ్ల మీద సంతకం చేయకపోవడం లాంటి విషయాలను ప్రస్తావించను కానీ సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం గురించి మాత్రం మాట్లాడుతాను’’ అని పేర్కొన్నారు. సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీల్లో గత 20 ఏళ్ల నుంచి వందలాది కాంట్రాక్టు టీచర్లు పేద పిల్లలకు చదువు చెబుతున్నారన్నారు. వీళ్లకు వచ్చే వేతనం అరకొరే అని, వీళ్లనందరినీ రెగ్యులరైజ్ చేయాలని వీళ్లు పోరాడని రోజు లేదు, తొక్కని గడప లేదన్నారు. పాపం ఒక్కొక్కరు డబ్బులు కలెక్ట్ చేసుకొని కోర్టుల్లో కూడా కేసులు వేశారని తెలిపారు. అయినా పాలకుల మనసు కరగలేదు సరికదా, ఎందుకో వారి మీద ద్వేషం పెంచుకున్నారని ప్రశ్నించారు.

అయితే, మూడు ఏళ్ల క్రితం సీఎం కార్యాలయం బీసీ వెల్ఫేర్‌లో కేవలం 44 మంది సీఆర్టీలను అత్యంత రహస్యంగా రెగ్యులరైజ్ చేసిందని, ఆ జీవోను అత్యంత గోప్యంగా ఉంచారని, దీనికి కారణం సీఎంకే తెలియాలని ఆరోపించారు. అదే బిల్డింగులో ఉన్న 600 మంది ఎస్సీ వెల్ఫేర్‌లో 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న సీఆర్టీలు (ఇందులో 80% మహిళలు) చెప్పులరిగేలా మంత్రుల చుట్టూ తిరిగిన రెగ్యులరైజ్ చేయడం లేదని ఆరోపించారు. దీని వల్ల పేద బిడ్డలకు అన్యాయం జరుగుతుందని సీఎంను అడిగే దమ్ము ఏ ఎస్సీ ఎమ్మెల్యే‌కు, మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు గానీ లేదన్నారు. నిజంగా ఉంటే వాళ్ళక్కడ ఉండరని, అందుకే వీళ్లను కాన్షీరాం “చెంచాలు” అని అన్నారని విమర్శించారు. ఈ విషయం కేబినెట్‌లో ప్రస్తావనకు రాకుండా సీఎం అడ్డుకున్నట్లు సమాచారం ఉన్నట్లు పేర్కొ్న్నారు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టి లోపల మాత్రం ఎస్సీ, ఇతర పేద వర్గాలపై తీవ్ర వివక్షతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇది బయటకు రాకుండా నిజం చెప్పే పత్రికలపై ఆంక్షలు పెడుతున్నారని ఆరోపించారు. ‘‘అందుకే ప్రియమైన ఉద్యోగ- ఉపాధ్యాయ మిత్రులారా, ఎండలో నిలబడి ఏడ్వడం కన్నా, నీడలో నిలబడి మన పార్టీ (బీఎస్పీ)కి ఓటేయమన్నారు మాన్యశ్రీ కాన్షీరాం’’ కావున ఈ దోపిడీ గడీల ప్రభుత్వాన్ని తమ ఓటు ఆయుధంతో కూకటివేళ్లతో తొలగించి, పారదర్శక ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించుకుందామని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed