మహిళా సంక్షేమానికి కేసీఆర్ కృషి.. బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సుధారాణి

by Dishafeatures2 |
మహిళా సంక్షేమానికి కేసీఆర్ కృషి.. బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సుధారాణి
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహిళా సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. మహిళా భద్రత కోసం షీటీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన మహిళలకు రక్షణ కవచంగా నిలుస్తున్నారని అన్నారు. తెలంగాణ భవన్ లో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. పారిశుధ్య మహిళా కార్మికులకు సత్కరించారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా

మహిళల కోసం సంక్షేమ, అభివృద్ధి, భద్రత, పోషణ కార్యక్రమాలను కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. మహిళా వ్యాపారవేత్తల కోసం వీ-హబ్, ఆసరా పెన్షన్, ఆరోగ్య లక్ష్మీ, కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్సీ వాణి దేవి మాట్లాడుతూ మహిళలు సవాళ్లను ఎదుర్కొని అన్ని రంగాల్లో రాణించినప్పుడే గుర్తింపు ఉంటుందన్నారు. విద్య, విజ్ఞానాలతో కూడిన విజ్ఞతతో వికృతాలను మహిళలు ఆత్మగౌరవంతో ఎదురించాలని, సమాజంలో సగభాగమైన మహిళలు సమానత్వం కోసం మగవారితో పోటీపడాలని సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను అందిపుచ్చుకొని మరింత ఆర్థికంగా ఎదగాలని కోరారు. అనంతరం మహిళలందరికీ మొక్కలను పంపిణీ చేసి తెలంగాణ భవన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, మంజుల, మన్నే కవిత, సామ హేమ, ఆర్ఓ సుశీల రెడ్డి, లలిత యాదవ్, అనిత నాయక్,హరి రమాదేవి, విజయ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed