- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్.. వాటిపైనే చర్చ పెట్టాలని పార్టీ డిమాండ్
తెలంగాణ శాసనసభ స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసనసభ స్పీకర్ ఛాంబర్లో (BAC meeting) బీఏసీ (శాసనసభా వ్యవహారాల కమిటీ) సమావేశం నిర్వహించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao), వేముల ప్రశాంత్రెడ్డి హాజరయ్యారు. బీజేపీ నుంచి ఏలేటీ మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, కేబినెట్ నిర్ణయాలు, కాళేశ్వరం నివేదిక అంశంపై బీఏసీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎరువుల కొరత, వరదలపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. అందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేసింది. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పీకర్కు లేఖ రాశారు.
రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని చూస్తోంది: హరీశ్రావు
బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ అయిన అనంతరం బీఆర్ఎస్ నేత హరీశ్రావు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. బీఏసీ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించామని తెలిపారు. మొదటి ప్రాధాన్యత వరదలపై, రెండవ ప్రాధాన్యత యూరియాపై చర్చకు కోరినట్లు తెలిపారు. గ్రామాలు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపంగా ఉందని, విష జ్వరాల వల్ల విద్యార్థుల మరణంపై చర్చ అడిగామన్నారు. ఫోర్త్ సిటీ పేరున జరుగుతున్న అక్రమాలు సీఎం కుటుంబ సభ్యులపై చర్చ కోరామన్నారు. హైడ్రా, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ బెనిఫిట్లపై చర్చించాలని కోరినట్లు తెలిపారు.
రెండే రోజులు అసెంబ్లీ జరుపుతామని అంటున్నారని, ఎరువులు, రైతుల, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రభుత్వం ఉండడం వల్ల వాకౌట్ చేశామని చెప్పారు. వరద బాధిత జిల్లాల గురించి కాకుండా బురద జల్లే రాజకీయాలు అసెంబ్లీలో మాట్లాడుతారట అని మండిపడ్డారు. ఒకే రోజు రేపు బీసీ రిజర్వేషన్ బిల్లు, కాళేశ్వరం ప్రాజెక్టు పై రిపోర్టు పెడతారట.. అని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించ కోకపోవడం ఇదేనా ప్రజా పాలన? అని ప్రశ్నించారు. కనీసం 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.






