సీఎం రేవంత్ రెడ్డితో BRS ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భేటీ

by Disha Web Desk 2 |
సీఎం రేవంత్ రెడ్డితో BRS ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వెళ్లారు. ఆదివారం సీఎంతో మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ప్రస్తుతం ఈ భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎంను కలవడం వెనుక ఆంతర్యమేంటని రాష్ట్ర ప్రజల్లో సరికొత్త చర్చ మొదలైంది. ఇటీవల నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా సీఎంను కలిసిన విషయం తెలిసిందే.

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎంను కలిసినవారిలో ఉన్నారు. ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ఇందులోనూ మాజీ మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడైన కొత్త ప్రభాకర్‌ రెడ్డి అపాయింట్‌మెంట్‌ తీసుకోవడం తీవ్ర దుమారాన్నే రేపింది. అయితే తాము మర్యాద పూర్వకంగానే కలిసినట్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చెప్పడంతో అనుమానాలకు పుల్‌‌స్టాప్ పడింది.

తాజాగా.. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే‌ ప్రకాశ్ గౌడ్ సింగిల్‌గా సీఎంను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అగ్ర నాయకులు కేటీఆర్, హరీష్ రావులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కారు హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరుపుతోంది. అక్రమాలు తేలితే బీఆర్ఎస్ బడా నేతలు జైలుకే అంటూ మంత్రులు, కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story