BRS: వేధింపులు ఆపకపోతే తీవ్ర ప్రతిఘటన తప్పదు.. సర్కార్‌కు బీఆర్ఎస్ నేత హెచ్చరిక

by Gantepaka Srikanth |

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt) ఒంటెద్దు పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసన మండలి ప్రతిపక్ష నేత ఎస్. మధుసూధనా చారి(Madhusudhana Chari) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

BRS: వేధింపులు ఆపకపోతే తీవ్ర ప్రతిఘటన తప్పదు.. సర్కార్‌కు బీఆర్ఎస్ నేత హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt) ఒంటెద్దు పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసన మండలి ప్రతిపక్ష నేత ఎస్. మధుసూధనా చారి(Madhusudhana Chari) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అడగడుగునా కొండను తవ్వి ఎలుకను పట్టే విధంగా ప్రభుత్వ ధోరణి కనబడుతోందని విమర్శించారు. అన్నింటా రేవంత్ విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. ఇస్తామన్న రైతు భరోసా(Rythu Bharosa)కు అనేక షరతులు పెట్టారని సీరియస్ అయ్యారు. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల్లో గొప్పలు చెప్పి.. ఇప్పుడు రూ.12 వేలకే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. రైతుల్లో ఆగ్రహం ఉందని తెలుసుకుని ప్రజల దృష్టి మళ్లించడానికి ఫార్ములా వన్ కేసు(F-1 Case)ను తెరమీదకు తెచ్చారని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారు.. ఇపుడు కూడా అదే ధోరణిని కాంగ్రెస్ ప్రదర్శిస్తోందని అన్నారు. హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉండగా కేటీఆర్‌(KTR)కు ఏసీబి నోటీసులు ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రజల్లో ఉంటున్న కేటీఆర్‌ను బద్నామ్ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం భయంకర కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేటీఆర్ వెంట లాయర్‌ను అనుమతించకపోవడం ప్రాధమిక హక్కును హరించడమే అని అన్నారు. ఈ ప్రభుత్వానికి కోతలు, కూల్చివేతలు తప్ప ఏమీ తెలియడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్‌(BRS)కు బలమైన కేడర్‌తో పాటు పోరాట పటిమ ఉందని తెలిపారు. రేవంత్ చిలిపి, వెకిలి చేష్టలకు భయపడం.. బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వేధింపులు ఆపకపోతే మా ప్రతి ఘటన తీవ్రంగానే ఉంటుందని అన్నారు.

Next Story