కేసీఆర్‌ను టచ్ చేస్తే అగ్ని గుండమే.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత

by Ramesh Naini |

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది.

కేసీఆర్‌ను టచ్ చేస్తే అగ్ని గుండమే.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సాయత్రం తెలంగాణ భవన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై నిరసన తెలిపారు. అంతేకాకుండా భవన్ దగ్గరలోని అగ్రసేన్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశాయి. ప్రభుత్వానికి, సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సిట్ నోటీసులు అంటూ డ్రామా..

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. సిట్ నోటీసులకు భయపడమని అన్నారు. కేసీఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ అగ్ని గుండం అవుతుందని హెచ్చరించారు. పాలన చేతకాక, హామీలు అమలు చేయడం రాక ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి సిట్ నోటీసులు అంటూ డ్రామా నడువుతున్నారని పార్టీ నేతలు మండి పడ్డారు. మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ మనో ధైర్యాన్ని దెబ్బ తీసేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం అర్థం చేసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో మన్నె గోవర్ధన్ రెడ్డి, కురువ విజయ్ కుమార్, సుమిత్రానంద్, బొమ్మెర రామ్మూర్తి, తొట్ల స్వామి యాదవ్, అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, రాయల కార్తీక్, పొట్ట నరేందర్ యాదవ్, సాయి తేజ రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story