BRS: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్‌లో కన్ఫ్యూజన్.. నేడు క్లారిటీ వచ్చే చాన్స్!

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-09 01:42:46  IST  )

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ పార్టీ తర్జనభర్జన పడుతోంది.

BRS: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్‌లో కన్ఫ్యూజన్.. నేడు క్లారిటీ వచ్చే చాన్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ పార్టీ తర్జనభర్జన పడుతోంది. ఈ ఎన్నికల్లో రెండో స్థానానికి క్యాండిడేట్‌ను ప్రకటిస్తే.. ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై అంతర్లీనంగా చర్చిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరకాటంలోకి పెట్టడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందుకోసం పార్టీ శ్రేణులతో ఎడతెగని చర్చలు సాగిస్తోంది. రెండో అభ్యర్థిని నిలబెడితే లాభమా? నష్టమా అన్న దానిపై బేరీజు వేసుకుంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగయనున్నది. ఐదు స్థానాలకు ఐదుగురు కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే ఎన్నికల పోరు ఖాయమని మరో ప్రచారం సాగుతోంది.

కారులో కూడికలు.. తీసివేతలు

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 38 స్థానాలను చేజెక్కించుకుంది. ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానాన్ని సంపాదించాలంటే 21 ఎమ్మెల్యేలు అవసరం. దీనిలెక్కన చూసుకుంటే మరో నలుగురు ఎమ్మెల్యేలు తమకు అవసరమని బీఆర్ఎస్ లెక్కలు కడుతోంది. రెండో అభ్యర్థిని నిలబెడితే...పార్టీ సింబల్​ద్వారా గెలిచిన వారందరికీ విప్​ జారీ చేయవచ్చునని బీఆర్‌ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్‌లో చేరిన​ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తాము గులాబీ దళాలమని ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి వైఖరిని బయటపెట్టేందుకు..వారిపై మరింత ఒత్తిడి పెంచడానికి బీఆర్ఎస్ పెద్దలు ఎత్తుగడలు వేస్తున్నారు. ఒకవేళ తాము విసిరిన విప్‌ను స్వీకరించకుంటే ..దానిని అస్త్రంగా తీసుకొని సుప్రీంకోర్టులో బలపర్చాలనే ఆలోచనతో గులాబీ పార్టీ ఉంది. అయితే రెండో అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలన్న దానిపై కారు పార్టీ సుదీర్ఘ చర్చలు సాగిస్తోంది.

ముందుకెళ్లేదెలా?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీఆర్‌ఎస్ ఎన్నికల నిబంధనలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఏజెంట్‌కు చూపించి ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సిన​అవసరం లేనందున ఎలా ముందుకు సాగాలన్న దానిపై పునరాలోచిస్తోంది. ఫిరాయింపుదారులు కాంగ్రెస్‌కు ఓటేస్తే.. నిరూపించడానికి అవసరమైన సాక్షాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో లభించకపోతే ముందుకెళ్లేదెలా అని పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. ఒకవేళ అదేగాని జరిగితే......సుప్రీంకోర్టులో సవాల్ చేయడం కష్టమని మరికొందరు నేతలు అంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఏజెంట్‌కు చూపించి అభ్యర్థులు ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో లేకపోవడంతో రెండో స్థానం కోసం బీఆర్‌ఎస్ తర్జన, భర్జన పడుతోంది. ఇదిఇలా ఉంటే.. బీఆర్‌ఎస్‌లో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురైతే పరిస్థితి ఏమిటన్న దానిపై కూడా కారు పార్టీ విశ్లేషిస్తోంది. ఏది‌ఏమైనా..రెండో స్థానానికి పోటీ చేయాలా లేదా అన్న అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ నేడు తేల్చే అవకాశం ఉంది.

Next Story