సోలాపూర్‌లో సభకు సన్నద్ధం.. మహారాష్ట్రపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్

by Disha Web Desk 12 |
సోలాపూర్‌లో సభకు సన్నద్ధం.. మహారాష్ట్రపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్రపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నాందేడ్‌, కందార్-లోహ, ఔరంగాబాద్‌, సాంగ్లీలో సభలు నిర్వహించారు. ఇప్పుడు సోలాపూర్ పై దృష్టి సారించారు. అక్కడ తెలుగువారు ఎక్కువగా ఉండటం, వారి నుంచి ఆదరణ వస్తుండడంతో పబ్లిక్ మీటింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నెల చివర్లో లేదా అక్టోబర్ మొదటి వారంలో సభను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నేతలు బాల్ కోట్, ఈద్గా మైదానాలను పరిశీలించారు.

పార్టీ అధినేత కేసీఆర్ సూచన తర్వాతనే సభా మైదానాన్ని ఎంపిక చేయనున్నారు. సభకు 3 లక్షల మందిని తరలించాలని భావిస్తున్నారు. అందుకోసం నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను నియమించి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఏర్పాట్ల బాధ్యతలను మ‌హారాష్ట్ర ఇన్ చార్జి వంశీధర్, కిసాన్ స‌మితి అధ్యక్షుడు మాణిక్ కదమ్ కు అప్పగించారు. సభ సక్సెస్ బాధ్యతలను మంత్రి హరీశ్ రావుకు అప్పగించడంతో ఆయన నిత్యం నేతలతో సమీక్షిస్తున్నారు. కేసీఆర్‌తో చర్చించి బహిరంగ సభ తేదీని ఖరారు చేస్తారని సమాచారం.

ప్రతి జిల్లా కేంద్రంలో సభ!

ఈ నెలాఖరులోగా మహారాష్ట్రలో పార్టీ పదాధికారుల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ నేతలను ఆదేశించినట్లు తెలిసింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించాలని ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు కోరుతున్న విషయాన్ని ఆ రాష్ట్ర నేతలు కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. అయితే అన్ని నియోజకవర్గాల్లో కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక బహిరంగ సభ నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. సోలాపూర్ లో నిర్వహించే భారీ బహిరంగ సభ అనంతరం సమయం, సందర్భాన్ని బట్టి నెల నుంచి 40 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ రాష్ట్రంలోని 36 జిల్లాల్లో సభలను నిర్వహించి పార్టీని పటిష్టం చేసేందుకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

20 లక్షల సభ్యత్వాలు..

ఇప్పటికే రాష్ట్రంలో 20 లక్షల మంది సభ్యత్వాలను చేసినట్లు తెలిసింది. అయితే మరిన్ని సభలు నిర్వహించి ప్రజాసమస్యలను ప్రస్తావించి ప్రజలను ఆకట్టుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాల్లో నిర్వహించే సభలకు షెడ్యూల్ ను రూపొందించే పనిలో నేతలు నిమగ్నమైనట్లు తెలిసింది. పార్టీ సభ్యత్వాలను పెంచడంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని అధినేత భావిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సైతం నేతలను ఇప్పటినుంచే పోటీకి సన్నద్ధం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ తర్వాత ఎక్కువ ఫోకస్ పెట్టిన రాష్ట్రం మహారాష్ట్రనే.



Next Story

Most Viewed