BREAKING: కిషన్‌రెడ్డి.. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలె: మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
Ponnam Prabhakar
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలంటూ మంత్రి ప్రభాకర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ ఒరగబెట్టిందేమి లేదని ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రాష్ట్రానికి పైసా నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. పైగా బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలకు బీజేపీ కూడా వంత పాడిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ కూడా రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు బోనస్ తప్పకుండా ఇస్తామని అన్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్థిక వ్యవస్థను చక్కబెడుతూనే ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నామని, అయినా ప్రతిపక్షాలు తమపై నిత్యం ఆరోపణలు చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, ధర్మపురి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు.

Next Story

Most Viewed