దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: పొంగులేటి

by Disha Web Desk 2 |
దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: పొంగులేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ సీనియర్ నేత, తమిళనాడు సహా ఇన్చార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ‘దొంగల ఇంటి పేరు మోదీ’ అంటూ చేసిన తప్పుడు వ్యాఖ్యల ఫలితంగానే రాహుల్ గాంధీకి రెండేళ్ల పాటు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పునిస్తే దానిని బీజేపీకి అంటగట్టడం అన్యాయం అన్నారు. కోర్టు తీర్పుకు, బీజేపీకి లంకె పెడుతూ కాంగ్రెస్ గాయి గాయి చేయడం సిగ్గు చేటన్నారు. విదేశాల్లో భారత్ పరువు తీసే ఘనుడు రాహుల్ గాంధీ అని, భారత దేశ సంపదను కొల్ల గొట్టింది కాంగ్రెస్ హయాంలోనే అని మండిపడ్డారు.

దేశ రాజకీయాల్లో పరిపక్వత లేని నాయకుడు రాహుల్ గాంధీ అని, జనాదరణ లేకనే రాహుల్ అమేథీలో ప్రజలు తిరస్కరించారన్నారు. ప్రపంచమే మోడీని కొనియాడుతుంటే దేశంలోని ప్రతిపక్షాలు పసలేని విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. చేసిన తప్పును రాహుల్ గాంధీ సరిదిద్దుకోవాలని, దేశ ప్రజలకు ఆయన బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed