ముస్లిం నాయకత్వం పై ఒవైసీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్

by Malleboina Mahesh |

ముస్లింలకు ప్రత్యేక నాయకత్వం లేదన్న ఒవైసీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మండిపడ్డారు.

ముస్లిం నాయకత్వం పై ఒవైసీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో ప్రతి సామాజిక వర్గానికి (OBC, SC, BC, పటేల్) ఒక నాయకత్వం ఉందని, కానీ ముస్లింలకు మాత్రమే నాయకత్వం లేదని అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు (N. Ramachandra Rao) తీవ్రంగా స్పందించారు. "ముస్లింలే కాంగ్రెస్.. కాంగ్రెస్సే ముస్లింలు" అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ప్రకటించారని, అలాంటప్పుడు మీకు వేరే నాయకత్వం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఓవైసీ వ్యాఖ్యలపై రామచందర్ రావు స్పందిస్తూ.. "ముస్లింలకు నాయకత్వం లేదని ఒవైసీ అనడం హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీలోనే మీకు అనేక మంది నాయకులు ఉన్నారు.

రేవంత్ రెడ్డి మాటల ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీయే ముస్లింల పక్షాన ఉంది. ఇంకా మీకు ప్రత్యేక నాయకత్వం ఎందుకు?" అని రామచందర్ రావు నిలదీశారు. భారతీయ జనతా పార్టీ కులాల వారీగా నాయకులను తయారు చేయదని, ప్రతి కులం, మతం, వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనుల సంక్షేమం కోసం తమ పార్టీ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఓవైసీ కేవలం తన రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని ఆయన సూచించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓ బహిరంగ సభలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ముస్లింలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోతున్నారని, స్వతంత్ర రాజకీయ నాయకత్వాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఆయనపై ఎదురుదాడికి దిగింది.

Next Story