Ramchander Rao: పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుస్తాం : బీజేపీ చీఫ్ రాంచందర్ ​రావు ధీమా

by Ramesh Naini |

రాష్ట్రంలో పంచాయతీ పోరులో కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Ramchander Rao: పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుస్తాం : బీజేపీ చీఫ్ రాంచందర్ ​రావు ధీమా
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో (Panchayat elections) పంచాయతీ పోరులో కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు (BJP chief Ramchandra Rao) ధీమా వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్‌తో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఈ ఎన్నికల ఫలితాలు దానికి నిదర్శనంగా నిలుస్తాయన్నారు. తమ పార్టీ బలహీనంగా లేదని, బలంగా ఉందని, రానున్న ఎన్నికల్లో మొదటి స్థానంలో నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశ్యం లేనందున 42 శాతం రిజర్వేషనకు తాము మద్దతు ఇస్తున్నామన్నారు. ఎన్నికల విషయంలో ప్రభుత్వం ముందు నుంచి డ్రామాలాడుతుందని, గవర్నర్​,బీజేపీ అడ్డుకుంటుందని ఆరోపించిందని, ఇప్పుడు జీవో ఎలా జారీ చేశారని ప్రశ్నించారు.

ఈ జీవోను గతంలో ఇచ్చి ఉంటే సమస్య ఇంతవరకు వచ్చేది కాదన్నారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం రాష్ట్రపతి, గవర్నర్ల పేర్లతో ఇప్పటి వరకు ఎన్నికలను అనవసరంగా ఆలస్యం చేసిందని విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఇప్పుడు రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా పూర్తి విరక్తితో ఉన్నారని ఆరోపించారు. తమ పార్టీ విజయానికి బలమైన పునాదులు ఉన్నాయని, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారని గుర్తుచేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తాను ఇప్పటికే 23 జిల్లాల్లో యాత్రలు పూర్తి చేశానని, మరో నాలుగు జిల్లాల పర్యటన మిగిలి ఉందన్నారు. ప్రజల నాడిని బట్టి చూస్తే, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని అన్నారు.

Next Story