ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రభాకర్ రావుకు, శ్రవణ్ కు రెడ్ కార్నర్ నోటీసులు

by Prasad Jukanti |
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రభాకర్ రావుకు, శ్రవణ్ కు రెడ్ కార్నర్ నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో/క్రైమ్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్‌కుమార్‌రావుకు హైదరాబాద్ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉండగా శ్రవణ్ కుమార్ లండన్‌లో ఉన్నారు. ఈ కేసులో వీరు ముందస్తు ప్లాన్‌లో భాగంగానే విదేశాలకు వెళ్లినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో వీరిని ఎలాగైనా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు తొలుత లుక్ ఔట్ నోటీసులతో పాటు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. తాజాగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఇందుకు అవసరమైన ప్రక్రియలో భాగంగా నాంపల్లి కోర్టులో సీఐడీ అధికారులు నిన్ననే చార్జిషీట్ సైతం దాఖలు చేశారు. ఈ నోటీసులు జారీ కావడంతో విదేశీ దర్యాప్తు సంస్థల సహకారంతో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌ను అరెస్ట్ చేసి స్వదేశానికి రప్పించే అవకాశం ఉంటుంది. కాగా తాజాగా పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో.. ఫోన్ ట్యాపింగ్ కేసు మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావును అరెస్ట్ చేశామని, నిందితులుగా మొత్తం ఆరుగురిని చేర్చినట్లు పేర్కొన్నారు.

బెయిల్ పిటిషన్‌పై రేపు తీర్పు

మరో వైపు ఈ కేసులో అరెస్ట్ అయిన భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళ కోర్టులో విచారణ జరిగింది. రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్ట్ చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉందని, అందువల్ల నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. బుధవారం తీర్పు వెలువరించనున్నది.



Next Story

Most Viewed