లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. అప్రూవర్‌గా శరత్ చంద్రారెడ్డి

by Disha Web Desk 4 |
లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. అప్రూవర్‌గా శరత్ చంద్రారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులోని మనీలాండరింగ్ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న స్పెషల్ జడ్జి ఆమోదం తెలిపారు. గత కొన్ని రోజులుగా అప్రూవర్ గా మారడానికి మానసికంగా సిద్ధమైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కోర్టు ద్వారానే లైన్ క్లియర్ కావడం గమనార్హం.

ఇప్పటికే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరుపుతున్న క్రమంలో దినేష్ అరోరా అప్రూవర్ గా మారారు. దీంతో అటు సీబీఐలో, ఇటు ఈడీలో వీరిద్దరు అప్రూవర్లుగా మారిన తర్వాత వారు ఇచ్చే స్టేట్ మెంట్లు తదుపరి దర్యాప్తుకు కీలకంగా మారనున్నాయి. ఈడీ ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేయగా శరద్ చంద్రరెడ్డి మనహా మిగిలిన వారంతా తిహార్ జైల్లో ఉన్నారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మొత్తం చక్రం తిప్పింది సౌత్ గ్రూప్ అంటూ ఇప్పటికే ఈడీ, సీబీఐ వేర్వేరు ఛార్జిషీట్లలో పేర్కొన్నాయి. ఆ గ్రూప్ లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శరత్ చంద్రరెడ్డి సభ్యులుగా ఉన్నారు. కవితపై ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలపై శరద్ చంద్రరెడ్డి అప్రూవర్ గా వెల్లడించే విషయాలు ఆమెను ఏ రకంగా ఇబ్బంది పెడతాయనే చర్చ గులాబీ పార్టీలో చోటు చేసుకున్నది.

భార్య అనారోగ్యం కారణంగా వైద్య చికిత్స చేయించడానికి తన సహకారం అవసరమైన పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వాల్సిందిగా శరత్ చంద్రారెడ్డి చేసుకున్న దరఖాస్తుకు స్పెషల్ కోర్టు సానుకూలంగా స్పందించడంతో గత కొన్ని రోజులుగా బయటనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అప్రూవర్ గా మారడానికి కోర్టు ఓకే చెప్పడంతో దీనిపై ఈడీ ఎలా స్పందిస్తుదన్నది ఆసక్తిగా మారింది. లాంఛనంగా అప్రూవర్ గా మారే ప్రక్రియ పూర్తయిన తర్వాత మనీలాండరింగ్‌లో తదుపరి దర్యాప్తు ఏ టర్న్ తీసుకుంటుందన్నది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను కలవరపెడుతున్నది.

Also Read..

వచ్చే ఎన్నికల్లో మంత్రి తలసాని గెలుపు కష్టమే!


Next Story

Most Viewed