మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్‌కు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన కాళేశ్వరం కమిషన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-08 04:03:37  IST  )

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌, అనుబంధ ప్రాజెక్టులపై కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ తుది దశకు చేరింది.

మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్‌కు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన కాళేశ్వరం కమిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌, అనుబంధ ప్రాజెక్టులపై కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ తుది దశకు చేరింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ గతేడాది నుంచి విచారణ చేపడుతోన్న విషయం విదితమే. బ్యారేజీల డిజైన్‌, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై ఇప్పటికే సమగ్ర విచారణ చేపట్టారు. సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన అంశాలపై ఇంజినీర్లు, ఉన్నతాధికారుల నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి ఆధారంగా వారిని క్రాస్‌ ఎగ్జామినేషన్ చేశారు. అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌లను కూడా కమిషన్ విచారించింది.

ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ నీటి పారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.అనిల్ కుమార్‌ (Anil Kumar) తాజాగా కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage)కు గ్రౌటింగ్ చేసిన విషయాన్ని ఎంక్వైరీలో దాచిపెట్టిన విషయాన్ని కమిషన్ గుర్తించింది. అదేవిధంగా ఉన్నత హోదాలో ఉండి అబద్ధపు స్టేట్‌మెంట్ ఇచ్చినందుకు ఆయనపై చైర్మన్ పీ చంద్రఘోష్ (P Chandraghosh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చి ఈనెల 9న తిరిగి విచారణకు రావాలని కమిషన్ ఆదేశించింది. అదేవిధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, అనుబంధ ప్రాజెక్టులకు సంబంధించి గత ప్రభుత్వ కేబినెట్ మినిట్స్ తనకు అందినట్లుగా కమిషన్ కార్యాలయం తెలిపింది. ఈనెల 27న కాళేశ్వరం కమిషన్ తుది నివేదకను ప్రభుత్వానికి అందజేయనుంది. కాగా, ఇవాళ మధ్యాహ్నం కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీ చంద్రఘోష్ బీఆర్కే భవన్‌కు చేరుకున్నారు. కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై అధ్యయనం చేయనున్నారు. అదేవిధంగా పలు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం సంబంధిత విషయాలను క్షుణ్ణంగా పరిశీలంచనున్నారు.

Next Story