డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు BIG అలర్ట్.. భారీ మోసానికి కుట్ర!

by Disha Web Desk 2 |
డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు BIG అలర్ట్.. భారీ మోసానికి కుట్ర!
X

దిశ, సిటీ బ్యూరో: మహానగరంలో ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయి. కొద్ది నెలల క్రితం గత సర్కారు పంపిణీ చేసిన డబుల్ బెడ్రూం లబ్ధిదారులను కేటుగాళ్లు మాయ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ప్రైవేటు వ్యక్తులు కొందరు ఫోన్లు చేసి మీ ఫ్లాట్ వాటర్ కనెక్షన్ మీటర్, కరెంటు మీటర్ నిమిత్తం రూ. 1250 చెల్లించాలని చెప్పటం శుక్రవారం నగరంలో కలకలం సృష్టి్ంచింది. 7463086318, 7296057957, 8274985469 ఫోన్ నెంబర్ల నుంచి నేరుగా కొందరు లబ్ధిదారులకు ఫోన్ వచ్చినట్లు వెల్లడించారు. ఫోన్ చేసిన వ్యక్తి డబుల్ ఇళ్లు పొందిన లబ్ధిదారుడు తన పేరిట రూ.1250 ను ఆన్ లైన్ లో చెల్లించాలని సూచిస్తున్నారు. తెలుగు యేతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తి, కేవలం హిందీలోనే మాట్లాడుతూ మీరు చెల్లింపులకు ఏ రకమైన యాప్ వినియోగిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకుని మరీ యాప్ ను బట్టి డబ్బుును పంపాల్సిన ఫోన్ నెంబర్ ఇస్తున్నారు. పే టీఎం, గూగుల్ పే లకు సంబంధించి వేర్వేరు ఫోన్ నెంబర్లను ఇస్తున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా రూ. 1250 చెల్లించాలని, వాటర్ కనెక్షన్ మంజూరైన తర్వాత చెల్లించిన వ్యక్తి కి రూ. 1200 తిరిగి వస్తాయని చెబుతూ శుక్రవారం ఒక్క రోజే వందలాది మందికి ఫోన్లు చేసినట్లు లబ్ధిరులు తెలిపారు.

రూ.1250 తో పాటు డబుల్ ఇళ్లు కేటాయించిన పత్రాలేమైనా పంపాలా? అన్న ప్రశ్నకు కేవలం డబ్బు పంపితే చాలు అని కాలర్ వ్యాఖ్యానించటంతో అనుమానం వచ్చిన కొందరు డబుల్ లబ్ధిదారులు ఫోన్లు వస్తున్న నెంబర్లను ట్రూ కాలర్ వేసి గమనించగా, జీహెచ్ఎంసీ ఆఫీసు అని, ఈవెంట్ ప్లానర్ అంటూ జీహెచ్ఎం లోగోతో కన్పిస్తున్నట్లు వెల్లడించారు. పైన పేర్కొన్న మూడు ఫోన్ నెంబర్లలో కొన్ని నెంబర్లకు జీహెచ్ఎంసీ లోగోతో పాటు మాజీ మేయర్ బొంతు రాంమోహన్ ఫొటో కూడా కన్పిస్తున్నట్లు కొందరు డబుల్ లబ్ధిదారులు వివరించారు. మరో ఫోన్ నెంబర్ ను ట్రూ కాలర్ లో వేసి గమనించగా, మరి కొందరు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ల ఫొటోలు వస్తున్నట్లు కాల్ వచ్చిన వారు చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ ఫేక్ అని విశ్వసించిన కొందరు లబ్ధిదారులు కాల్ చేసిన వ్యక్తికి చీవాట్లు పెట్టగా, సదరు వ్యక్తి ఎదురు చీవాట్లు పెట్టినట్లు మరి కొందరు వెల్లడించారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా డబుల్ ఇళ్లకు వాటర్, కరెంట్ కనెక్షన్ వంటివి సర్కారే సమకూర్చిందని, ఎవరూ నమ్మి డబ్బులు పంపించాల్సిన అవసరం లేదని కొట్టి పారేస్తున్నారు.

సైబర్ క్రైం దృష్టికి...

శుక్రవారం ఉదయం నుంచి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ఫోన్లు చేసి రూ. 1250 చెల్లించాలని, కొద్ది రోజుల తర్వాత రూ. 1200 తిరిగి వస్తాయని నమ్మిస్తూ వస్తున్న కాల్స్ ను కొందరు రికార్డు చేసి, న్యూస్ ఛానెళ్లకు పంపగా, మరి కొందరు ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ వింగ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ ఫోన్ల వ్యవహారం ఆ నోటా ఈ నోటా ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డికి దృష్టికి సైతం వెళ్లగా, ఆయన కూడా సైబర్ క్రైం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అమాయకులను టార్గెట్ చేసుకుని, వారి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు కొన్ని అంతర్ రాష్ట్ర ముఠాలే ఈ వసూళ్లకు పాల్పడినట్లు కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పోలీసులు ఎలాంటి విచారణ చేపడుతారు? ఈ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులెవరు? వారి వెనకానున్న వారెవరు? అన్నది తేల్చే పనిలో పోలీసులున్నట్లు విశ్వసనీయ సమాచారం.


Next Story