బీబీనగర్ ఎయిమ్స్‌ వైద్యుల ఘనత.. దేశంలో తొలిసారి డెంగీ వ్యాక్సిన్ తయారీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-06 02:04:40  IST  )

దేశంలోనే మొదటి సారిగా బీబీనగర్ ఎయిమ్స్‌లో డెంగ్యూ నిర్మూలనకు వ్యాక్సిన్ తయారైంది.

బీబీనగర్ ఎయిమ్స్‌ వైద్యుల ఘనత.. దేశంలో తొలిసారి డెంగీ వ్యాక్సిన్ తయారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే మొదటి సారిగా బీబీనగర్ ఎయిమ్స్‌లో డెంగీ నిర్మూలనకు వ్యాక్సిన్ తయారైంది. జాతీయ స్థాయిలో డెంగీ నిర్మూలనే లక్ష్యంగా ప్రారంభించిన పరిశోధనల్లో తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ కీలక పాత్ర పోషించింది. వ్యాక్సిన్ తయారీలో ఈ ఆస్పత్రిలోని కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగంలో అడిషనల్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న డాక్టర్ రష్మీ కీలక పరిశోధకురాలిగా పని చేస్తున్నారు. ‘డెంగీ ఆల్‘ పేరుతో అభివృద్ధి చెందుతున్న ఈ వ్యాక్సిన్ మూడో దశ క్లీనికల్ ట్రయల్స్‌ కోసం సుమారు 20 ప్రాంతాలను ఎంపిక చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో తయారయ్యే వ్యాక్సిన్ వాడకంతో డెంగ్యూలోని నాలుగు రకాల ఉప వ్యాధులను నిర్మూలించే అవకాశం ఉంది.

70 శాతం మంది అంగీకారం

దేశ వ్యాప్తంగా సుమారు 10వేల మంది పాల్గొననున్న ఈ కీలక పరిశోధనను 70 శాతం మంది అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దేశంలోని 20 ప్రాంతాల్లో జరిగే పరిశోధనలకు ఒక్కో ప్రాంతానికి రూ.1.5 కోట్లు కేటాయించారు.

వ్యాక్సిన్ చరిత్ర ఇదే..

‘డెంగీ ఆల్’ వ్యాక్సిన్‌ను మొదట పెనాసియా బయోటెక్ తయారు చేసింది. అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో తయారైన ఈ వ్యాక్సిన్ నాలుగు రకాల డెంగీ వైరస్‌పై ప్రభావవంతంగా పని చేస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ అతి తక్కువగా ఉండడం విశేషం. వర్షాకాలంలో ఆడ ఏడీస్ ఈజిప్టి దోమ కాటు వల్ల వచ్చే డెంగీకి సరైన ట్రీట్‌మెంట్ లేదు. 2024లో దేశ వ్యాప్తంగా 2 లక్షల 30 వేల కేసులు నమోదు కాగా 297 మంది చనిపోయారు.

Next Story