సాదాబైనామాల‌ పరిష్కారానికి దారి భూ భారతి : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

by Muthe.Rajitha |

భూ భారతి చట్టం ద్వారా సాదాబైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రక‌టించారు.

సాదాబైనామాల‌ పరిష్కారానికి దారి భూ భారతి : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ భారతి చట్టం ద్వారా సాదాబైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రక‌టించారు. వీటిపై ఉన్న స్టేను రాష్ట్ర హైకోర్టు మంగళవారం తొలగించిందని, ఈ తీర్పు లక్షలాది మంది పేద ప్రజల కలలను సాకారం చేస్తుందన్నారు. సాదాబైనామాల విషయంలో గత ప్రభుత్వం పేద ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించారని, కానీ ఆర్వోఆర్ 2020 చట్టంలో ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం చూపించలేదని విమర్శించారు.

ఫలితంగా 9.26 లక్షల దరఖాస్తులు పరిష్కారం కాకుండా పోయాయని, దీనిపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారన్నారు. సాదాబైనామాల దరఖాస్తులను పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో తమ ప్రభుత్వం నిరంతరం హైకోర్టులో కేసుకు ముగింపు లభించేలా కృషి చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఈ సమస్యకు పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం భూభారతి చట్టంలో స్పష్టమైన నిబంధనలను పొందుపరిచిందన్నారు. సాదాబైనామాల ద‌ర‌ఖాస్తుల‌ను సాధ్యమైనంత త్వర‌గా ప‌రిష్కరిస్తామ‌ని మంత్రి చెప్పారు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేసినట్లు తెలిపారు. గ‌త ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన ధ‌ర‌ణి పోర్టల్ ని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు బంగాళాఖాతంలో క‌లిపేశామ‌ని, దేశంలోని 18 రాష్ట్రాల్లో అధ్యయ‌నం చేసి భూ భార‌తి -2025 చ‌ట్టాన్ని రూపొందించామ‌న్నారు. రోల్ మోడ‌ల్‌గా నిలిచిన ఈ భూభార‌తి చ‌ట్టం మేర‌కు రైత‌న్నలు, ప్రజ‌ల స‌మ‌స్యలు ప‌రిష్కరించేందుకు స‌ద‌స్సులు నిర్వహించ‌గా 8.60 ల‌క్షల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌న్నారు. ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపించే తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తుందని అన్నారు.

Next Story