Bathukamma: హైదరాబాద్‌లో బతుకమ్మ ఉత్సవాలు.. గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా 29న వేడుకలు.. మంత్రుల స‌మీక్ష‌

by Ramesh Naini |

ఈ నెల 29న గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్ లక్ష్యంగా స‌రూర్‌న‌గ‌ర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ వేడుకలను విజ‌యవంతం చేయాల‌ని మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, కొండా సురేఖ‌, సీత‌క్క పిలుపునిచ్చారు.

Bathukamma: హైదరాబాద్‌లో బతుకమ్మ ఉత్సవాలు.. గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా 29న వేడుకలు.. మంత్రుల స‌మీక్ష‌
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఈ నెల 29న గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్ లక్ష్యంగా స‌రూర్‌న‌గ‌ర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన (Bathukamma celebrations) బతుకమ్మ వేడుకలను విజ‌యవంతం చేయాల‌ని, ఆ దిశ‌గా ఏర్పాట్లు చేయాల‌ని మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, కొండా సురేఖ‌, సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. గురువారం స‌చివాల‌యంలో అధికారుల‌తో మంత్రులు స‌మీక్ష నిర్వ‌హించారు. సమీక్ష‌లో మంత్రులు మాట్లాడుతూ.. ఈ నెల 27న ట్యాంక్‌బండ్ పై బతుక‌మ్మ కార్నివాల్, 28న బైక్, సైకిల్ ర్యాలీలు, 29న స‌రూర్‌న‌గ‌ర్ స్టేడియంలో 10 వేల మంది మ‌హిళ‌ల‌తో బతుక‌మ్మ‌ (Guinness Book of World Records) గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు, 30న ట్యాంక్ బండ్‌పై స‌ద్దుల బ‌తుక‌మ్మ కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని తెలిపారు, దీనికి అనుగుణంగా ప్రతిష్ఠాత్మకంగా సన్నాహాలు జరగాలని సూచించారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, ట్యాంక్ బండ్‌తో పాటు పీవీ మార్గ్, సచివాల‌యం, స‌రూర్ న‌గ‌ర్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు.

బతుకమ్మల నిమజ్జనం

బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని అలర్ట్ చేశారు. మహిళలకు సౌకర్యాలు కల్పించాలని వారు అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పండగ ప్రాశస్త్యానికి అద్దం పట్టేలా హైదరాబాద్‌లో చారిత్ర‌క ప్ర‌దేశాల‌తో పాటు ప్ర‌ధాన జంక్ష‌న్ల‌ను అందమైన ఆకృతులతో, విద్యుత్ దీపాల‌తో అలంకరించాలి, వైభవోపేతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పోలీస్, ట్రాన్స్‌కో, ఇత‌ర శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని సూచించారు.

స్టేడియంలో పది వేల మందితో వేడుకలు..

స‌రూర్‌న‌గ‌ర్ స్టేడియంలో ఈ నెల 29న పది వేల మందితో బతుకమ్మ వేడుకలు, 63 అడుగుల ఎత్తైన బతుకమ్మను ఏర్పాటు చేసి గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లో చేర్చేలా ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని మంత్రులు సూచించారు. స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు చెందిన మ‌హిళ‌ల‌ను త‌ర‌లించే బాధ్య‌త‌ను సెర్ఫ్ అధికారులు తీసుకోవాల‌ని, దీనికి తోడు మిగిలిన వారిని తీసుకువ‌చ్చేందుకు హైద‌రాబాద్, రంగారెడ్డి, యాదాద్రి క‌లెక్ట‌ర్లు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని చెప్పారు. జానపద, గిరిజన కళాకారుల మధ్య వేలాదిమంది మహిళలు బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి ట్యాంక్‌బండ్​లో నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మ‌హిళా స్వ‌యం స‌హాయక బృందాల స‌భ్యులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, హైద‌రాబాద్ న‌గ‌ర వాసులు పెద్ద ఎత్తున బతుక‌మ్మ ఉత్స‌వాల్లో పాల్గొని విజ‌యంతం చేయాల‌ని మంత్రులు పిలుపునిచ్చారు. ఈ స‌మీక్ష‌లో రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్లు శోభ రాణి, సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్, ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Next Story