'Bandi Sanjay' ఆరో విడత యాత్రకు హై కమాండ్ గ్రీన్ సిగ్నల్

by Disha Web Desk 2 |
Bandi Sanjay ఆరో విడత యాత్రకు హై కమాండ్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాషాయ దళపతి బండి సంజయ్ పాదయాత్రకు బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈనెల 18 నుంచి ఆరో విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించాలని పార్టీ శ్రేణులు ప్లాన్ వేస్తున్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, రూట్ మ్యాప్ ఎలా ఉండాలనే దానిపై నేతలు కసరత్తు చేస్తున్నారు. అయితే సిక్స్త్ ఫేజ్ ను కొడంగల్ నుంచి నిజామాబాద్ వరకు నిర్వహించాలని శ్రేణులు భావిస్తున్నాయి. అన్నీ ఓకే అనుకుంటే ఇదే రూట్ లో యాత్ర ఫిక్స్ కానుంది. ఇతరత్రా కారణాల వల్ల రూట్ మార్చుకుంటే ములుగు నుంచి ఖమ్మం వరకు చేపట్టాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీజేపీ జాతీయ నాయకత్వం పలు షరతులు విధించినట్లు సమాచారం. ఎన్నికల ఏడాది కావడంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని తెలంగాణ నేతలకు అధినాయకత్వం సూచించినట్లు తెలిసింది.

కాస్త ఆలస్యమైనా..

ఐదు విడతల ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్ 56 నియోజకవర్గాలను చుట్టేశారు. ఎన్నికల ఏడాది కావడంతో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతంపై చేయాలని హైకమాండ్ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఆందోళనలు, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించింది. ఎన్నికల క్యాలెండర్ ను కూడా అందించి, ఏ నెలలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే అంశాలపై పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎప్పుడో నిర్వహించాల్సిన ఆరో విడుత ప్రజా సంగ్రామ యాత్రకు కొంత బ్రేక్ వచ్చినా.. ఇప్పుడు మళ్లీ స్టార్ట్ కానుంది.

శ్రేణుల నుంచి ఒత్తిడి..

పాదయాత్ర చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై వివిధ నియోజకవర్గాల నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో ఆరో విడత పాదయాత్ర కోసం హై కమాండ్ కు నివేదించారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన ఎలక్షన్ క్యాలండర్ ను ఫాలో అవుతూ.. పాదయాత్ర చేసుకోవాలని జాతీయ నాయకత్వం సూచించినట్లు సమాచారం. గ్రామస్థాయిలో స్ట్రీట్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ.. అసెంబ్లీ సెగ్మెంట్లపై రివ్యూలు కొనసాగిస్తూ.. పార్టీ లక్ష్యాలకు ఇబ్బంది లేకుండా పాదయాత్ర చేసుకోవడానికి ఢిల్లీ పెద్దలు పచ్చజెండా ఊపారు. ఒక్క పాదయాత్రపైనే కాకుండా పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన మిగతా అంశాలపైనా దృష్టిసారించాలని బండి సంజయ్ కు అధిష్టానం సూచించినట్లు తెలిసింది. ఇక ప్రజాసంగ్రామ యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలనే దానిపై చర్చ సాగుతున్నది. వాస్తవానికి ఆరో విడతను హైదరాబాద్ లో చేపట్టాలని తొలుత బండి సంజయ్ నిర్ణయించారు. కానీ కొడంగల్ నుంచి నిజామాబాద్ వరకు చేపడితే బాగుంటుందని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. అనివార్య కారణాల వల్ల రూట్ మ్యాప్‌లో మార్పులుంటే ములుగు నుంచి ఖమ్మం వరకు చేయాలని భావిస్తున్నారు.

అధిష్టానం కితాబు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీ క్రమంగా ఎదుగుతూ వచ్చింది. గతంలో ఎన్నడూ లేనంత హైప్ వచ్చింది. ఏకంగా అధికార పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అనేంత రేంజ్ కి బండి పార్టీని తీసుకెళ్లారు. గులాబీ పార్టీకి ఏకుకు మేకులా తయారయ్యారు. ఈ కారణంగానే బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రకు హైకమాండ్ ఓకే చెప్పినట్లు సమాచారం. పాదయాత్రల వల్ల పార్టీకి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. బండి సంజయ్ పై అధిష్టానానికి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుం డా పార్టీ ఎదుగుదలకు కృషి చేయడంపై హైకమాండ్ శభాష్ అని కితాబిచ్చినట్లు సమాచారం. కేసీఆర్ ముందస్తుకు వెళ్తే ఎలా అని ఆలోచనలో పడిన ఢిల్లీ పెద్దలు పాదయాత్రతో పార్టీ బలోపేతం అవుతుందని నమ్మి అటు పాదయాత్రతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపైనా దృష్టిసారించాలని దిశానిర్దేశం చేశారు. బండిపై భరోసాతో జాతీయ నాయకత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు వినికిడి.

Also Read..

తెలంగాణ బీఆర్ఎస్ బాస్ ఎవరు?


Next Story

Most Viewed