మంత్రులు, ఐఏఎస్‍ల బండారం అంతా బయట పెడతా..బండి సెన్సెషనల్ కామెంట్స్

by Prasad Jukanti |

ఒవైసీ కళ్లలో ఆనందం కోసం సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ విభజన చేశారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రులు, ఐఏఎస్‍ల బండారం అంతా బయట పెడతా..బండి సెన్సెషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి (BJP) వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పని చేశాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసిన కరీంనగర్ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ చెంప చెళ్లుమనిపించారన్నారు. సీఎం స్థాయి వ్యక్తులు కరీంనగర్ కార్పొరేషన్‍లో (Karimnagar Corporation) కుట్రలు చేశారని.. సభ్యులకు బ్లాంక్ చెక్కులు, కార్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పెద్దలు, బీఆర్ఎస్ పెద్దలు ఈ కుట్రలో భాగమయ్యారని ధ్వజమెత్తారు. ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్‍కు చెందిన 10 డివిజన్ కార్పొరేటర్ నాంపల్లిలోనీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్టేట్ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు.

ఒవైసీ కళ్లలో ఆనందం కోసమే:

ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, అఖిలపక్షం మీటింగ్ లేకుండా, ప్రజాప్రతినిధుల అభిప్రాయం లేకుండా ఏకపక్షంగా జీహెచ్ఎంసీని విభజించడం సిగ్గు చేటని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. జీహెచ్ఎంసీని మూడు ముక్కలు ఎందుకు చేశారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. జీహెచ్ఎంసీలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, బీజేపీకి భయపడే హిందూ సమాజ ఓట్లను చీల్చడానికే జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేశారన్నారు. కోటిన్నర జనాభా, 40 వేల కోట్ల బడ్జెట్ కలిగిన ముంబై కార్పొరేషన్ ను విభజించలేదని రెండు కోట్ల జనాభా కలిగిన ఢిల్లీని, చెన్నై కార్పొరేషన్ ను చీల్చలేదు... మరి జీహెచ్ఎంసీని ఎందుకు ముక్కలు చేశారని ప్రశ్నించారు. ఒవైసీ కళ్లల్లో ఆనందం చూడటం కోసం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) జీహెచ్ఎంసీని (GHMC) మూడు ముక్కలు చేశారని ఆరోపించారు.

ఆ డబ్బులన్ని ఎటుపోయాయి?

రెండేళ్ల పాలనలో జీహెచ్ఎంసీ పరిధిలో తట్ట మొరం పోసిన దాఖలాల్లేవని భాగ్యనగర్ ప్రజలంతా తిరగబడే రోజులు రాబోతున్నాయన్నారు. తెలంగాణ రైజింగ్ పేరుతో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు కదా? ఆ డబ్బులన్నీ ఎటుపోయాయి? ఎంత మందికి ఉద్యోగాలిచ్చారు? ఎన్ని యూనిట్లు ప్రారంభించారు? సమాధానం చెప్పాలన్నారు. దావోస్ కు రెండు సార్లు వెళ్లి రూ.2.15 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.. ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు.

టీపీసీసీ కాదు.. టీ4సీ:

ఇది టీపీసీసీ కాదని టీ4సీ (తెలంగాణ కరప్షన్, కమీషన్, కలెక్షన్, కాంగ్రెస్)అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. భాగ్యనగర్‍లో కాంగ్రెస్‍ను మూసీ నదిలో పడేయడం ఖాయం అన్నారు. దిమ్మతిరిగే విధంగా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పబోతున్నారని భాగ్యనగర్ ప్రజలారా....ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను రెండేళ్లలో చేసిందేమిటో చెప్పాలని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించడానికే పరిమితమవుతున్నారే తప్ప తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బెన్ ఫిట్స్ ఇవ్వకుండా వారి ఉసురు తీసుకుంటున్నారని ఇదేమిటని ప్రశ్నిస్తున్న వృద్ధులను జైల్లో వేయడానికి సిగ్గు లేదా? అని మండిపడ్డారు.

మంత్రులు, ఐఏఎస్‍ల అవినీతి భయపెడతాం:

రాష్ట్ర మంత్రుల అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నారు. మంత్రుల అవినీతికి కొందరు ఐఏఎస్ అధికారులే మధ్యవర్తులుగా ఉన్నారు. అతి త్వరలో మంత్రుల కమీషన్ల చిట్టా, ఐఏఎస్ అధికారుల దందాలన్నీ బయటపెడతామన్నారు. ఐఏఎస్ అధికారులారా 2047 వికసిత్ భారత్ లక్ష్యాలు నెరవేరేదాకా బీజేపీ ప్రభుత్వమే కొనసాగుతోందన్నారు. 2029 నాటికి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పాలన ఉండదని మంత్రి పదవులను అడ్డుపెట్టుకుని బరితెగించి బీజేపీని అడ్డుకోవాలనుకుంటే మీ సంగతి చూస్తామని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతలను ఇబ్బంది పెట్టారు. మంత్రుల మెడలు వంచుతాం...6 గ్యారంటీలు అమలయ్యేలా చేస్తామన్నారు. భాగ్యనగర్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే మోడీ ప్రభుత్వ నిధులే శరణ్యం అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కాషాయ జెండాను ఎగరేయబోతున్నాం

Next Story