కేసీఆర్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి: సీఎంకు బండి సంజయ్ బహిరంగ లేఖ

by Disha Web Desk 19 |
కేసీఆర్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి: సీఎంకు బండి సంజయ్ బహిరంగ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ( ఓఆర్‌ఆర్‌ ) టెండర్‌ ప్రక్రియలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపించాలని.. అలాగే వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీ‌ఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు.

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ టెండర్‌ దక్కించుకున్న ఇన్ఫ్రాస్ర్టక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ (ఐఆర్బీ) సంస్థనే మహారాష్ట్రలోని ముంబై – పుణె ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు, ముంబై–పుణె నేషనల్ హైవే –4 టోలింగ్‌తో పాటు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యతను కూడా నిర్వహిస్తుంది. దీని పరిధి 1014 లేన్‌ కిలోమీటర్లు. దీని ఒప్పంద కాలం 10 ఏళ్లకు దాదాపు. ఆదాయం రూ.8,875 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. మరి తక్కువ దూరం, తక్కువ కాలానికి మహారాష్ట్ర ప్రభుత్వం టెండర్‌ అప్పగించినప్పుడు ఎక్కువ కాలం, ఎక్కువ దూరానికి తక్కువ ధరకు టెండర్‌ ఇవ్వాల్సిన అవసరం ఏమిటో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బండి డిమాండ్ చేశారు.

ఓఆర్‌ఆర్‌‌పై ఏడాదికి రూ.415 కోట్ల ఆదాయం వస్తుందని.. ప్రతీ ఏటా 5% పెంచుకుంటూ పోయినా 30 ఏళ్లకు ప్రభుత్వానికి రూ.30,000/- కోట్ల ఆదాయం చేకూరేదన్నారు. ప్రభుత్వం ఈ ఆలోచన చేయకపోవడం వెనకవున్న ఆంతర్యం ఏమిటి? రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండికొట్టి మరీ టెండర్‌ ఇవ్వడం వెనుక జరిగిన తతంగం ఏమిటి అని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వం ఈ విషయంలో ఇంత గోప్యత ఎందుకు పాటిస్తోందని బండి ప్రశ్నించారు.

ఓఆర్‌ఆర్‌ టెండర్‌పై ప్రభుత్వ మార్గదర్శకాల టెండర్ల నోటిఫికేషన్ దగ్గర నుంచి.. ఫైనలైజేషన్ వరకు అంతా రహస్యంగానే ఉంచిందని.. బేస్ ప్రైస్‌‌‌‌‌‌‌‌ ఎంత పెట్టారో కూడా చెప్పేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నదని ఆరోపించారు. మరోవైపు ఓఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వార్తలు రాస్తే బెదిరింపులకు దిగుతున్నది. ప్రశ్నించే పార్టీలకు లీగల్ నోటీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నది. అసలు ఈ టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో ఏదో జరిగిందన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతున్నదని తెలిపారు. తక్షణమే ఓఆర్ఆర్ టోల్ టెండర్ వ్యవహారంపై వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.

తెలంగాణా ప్రభుత్వానికి ఇదివరకే లిక్కర్‌, లీకేజి, ప్యాకేజీల పేరుతో అవినీతి మరకలు అంటాయని.. ఇప్పుడు ఓఆర్‌ఆర్‌ టెండర్‌లో భారీ స్కామ్‌‌పై మీరు మౌనం వహిస్తే అవినీతి జరిగిందనే అనుమానాలను బలపరుస్తాయని లేఖలో పేర్కొన్నారు. టెండర్‌ అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని.. ఒక ముఖ్యమంత్రిగా ఆ ఆరోపణలకు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరముందని తెలిపారు.

Next Story

Most Viewed