కేసీఆర్ పాలన ఉండేది కేవలం ఐదు నెలలే: బండి సంజయ్

by Disha Web Desk 2 |
కేసీఆర్ పాలన ఉండేది కేవలం ఐదు నెలలే: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు సీఎం కేసీఆర్ కుటుంబం కుట్ర చేస్తోందని, రాష్ట్రంలో విలువైన ఆస్తులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లీజు పేరిట దోచిపెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కాచిగూడలో భారతీయ మజ్దూర్ సంఘ(బీఎంఎస్) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీని వ్యూహాత్మకంగానే కేసీఆర్ దివాళా తీయిస్తూ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులంతా ఏకం కావాలని, తెలంగాణ ఉద్యమం నాటి తెగువను చూపాలని ఆయన కోరారు. కేసులు పెట్టినా, ఉద్యోగాల నుంచి తొలగించినా భయపెడొద్దని చెప్పారు. ఉద్యోగులు, కార్మికులకు అండగా తామున్నామన్నారు. రోడ్లపైకి వచ్చి కొట్లాడాలని, ఉద్యోగాల నుంచి తొలగిస్తే 5 నెలలు లాంగ్ లీవ్ పెట్టామనుకోవాలని బండి పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, వెంటనే తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటామని సంయజ్ భరోసా ఇచ్చారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని కాపాడుకునేందుకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు తాను అండగా ఉంటానని, కేసీఆర్‌కు ఆర్టీసీ కార్మికుల దమ్మేందో తెలుసన్నారు. కేసీఆర్ పాలన ఉండేది కేవలం 5 నెలలేనని సంజయ్ జోస్యం చెప్పారు. సమ్మె సమయంలో చనిపోయిన కార్మిక కుటుంబాలన్నింటినీ ఆదుకుంటామని, ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్టీసీని రూ.5 వేల కోట్ల అప్పు ఉందని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. రూ.లక్షన్నర కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టడానికి ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రకు తెరదీశారని ఆరోపించారు. ఆర్మూర్‌లో బస్టాండ్ కాంప్లెక్స్‌ను స్థానిక ఎమ్మెల్యేకు లీజుకిచ్చారని, ఇప్పటి వరకు రూ.7 కోట్ల కిరాయి బకాయిలు కట్టనేలేదన్నారు. కేసీఆర్ రోజూ పని చేయకుండా తాగుతున్నారని, పని చేస్తున్నట్లు నటిస్తున్నారని సంజయ్ విమర్శలు చేశారు. కేసీఆర్ తాగే ఫోటోలను కూడా వాట్సప్‌లో పంపిస్తాడా? అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు తలుచుకుంటే సర్కార్‌కు చుక్కలు చూపించొచ్చని, విద్యుత్ కార్మికులు సమ్మె మొదలు పెట్టారని, పంచాయతీ కార్యదర్శులు సైతం సమ్మె స్టార్ట్ చేశారని తెలిపారు.

ఉద్యోగుల సమస్యలే కాదు చివరకు మెడికల్ ట్రీట్ మెంట్‌కు కూడా డబ్బులివ్వని దుర్మార్గుడు కేసీఆర్ అని ఆయన విమర్శించారు. ఓవైసీపై కేసీఆర్ ప్రేమకు చిహ్నమే నూతన సచివాలయమని, ఆయన ప్రేమకు తగ్గట్టే కట్టారని, ఆ బానిస చిహ్నాలను తొలగిస్తానన్నానే తప్ప సచివాలయాన్ని కూలుస్తానని తాను చెప్పలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలు, బలిదానాలకు చిహ్నంగా నిర్మించాల్సిన సచివాలయాన్ని ఓవైసీ కోసం కడతారా? అని ప్రశ్నించారు. ఉచిత కరెంట్ బకాయిలు రూ.60 వేల కోట్లు చెల్లించకుండా డిస్కంలను సంక్షోభంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ కార్మికులంతా బయటకు వచ్చి కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని, కేసీఆర్ సంగతి చూసే బాధ్యతను తాము తీసుకుంటామని, అందరం కలిసి చరిత్రను తిరగరాద్దామన్నారు. మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళితబంధులో 30 శాతం కమీషన్లు తీసుకున్నారని స్వయంగా సీఎం కేసీఆరే చెప్పారని, మరి వారిపై ఎందుకు క్రిమినల్ కేసు పెట్టడంలేదని సంజయ్ ప్రశ్నించారు.

Next Story