Bandi: ముందు ఎంఐఎం చీఫ్‍గా ఒక మహిళను నియమించు.. ఒవైసీకి బండి సంజయ్ కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2026-01-11 12:07:28  IST  )

బుర్ఖా ధరించిన మహిళను ప్రధాని చేయాలన్న అసద్ వ్యాఖ్యలకు బండి కౌంటర్ రియాక్ట్ అయ్యారు.

Bandi: ముందు ఎంఐఎం చీఫ్‍గా ఒక మహిళను నియమించు.. ఒవైసీకి బండి సంజయ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏదో ఒక రోజు హిజాబ్‌ ధరించిన మహిళ కచ్చితంగా భారతదేశ ప్రధాన మంత్రి అవుతారు. ఇది నా కల అంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కౌంటర్ ఇచ్చారు. అసద్ ఇలాంటి కలలు కనే ముందు ఎంఐఎం పార్టీ చీఫ్‍గా ఓ మహిళను నియమించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసిన బండి సంజయ్.. భారత్‍కు బుర్ఖా ధరించిన మహిళను ప్రధాని చేసే ముందు మీ పార్టీలో నిజమైన నిర్ణయాధికార స్థానాల్లో ఎంత మంది మహిళలు ఉన్నారని నిలదీశారు. ఎంఐఎం పార్టీ ఇప్పటి వరకు ఎంత మంది ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చిందని ప్రశ్నించారు. 2018లో ఓల్డ్ సిటీలో అక్బరుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా బీజేపీ షహ్జాదీ సయ్యద్‌ అనే మహిళను బరిలో దించితే ఆమెను బెదిరించి టార్గెట్ చేసి చివరకు ఓడించారన్నారు. మహిళల విషయంలో ఇది మీ అసలు ముఖం అని విమర్శించారు. మీరు ఓడించినా నేను ఆమె జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలిగా సేవలు అందిస్తోందని గుర్తు చేశారు.

మీ ద్వంద్వ వైఖరిని గమనిస్తున్నారు:

బీజేపీకి మైనారిటీ మోర్చా ఉందని మహిళా నేతలను తీర్చిదిద్దుతుందన్నారు. మరి ఎంఐఎం పార్టీ సంగతేమిటని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీలో మహిళల ప్రాతినిథ్యం శూన్యమనే నిజాన్ని ఈ నినాదాలు దాచలేవన్నారు. ముస్లిం మహిళలు మీ ద్వంద్వ వైఖరిని స్పష్టంగా గమనిస్తున్నారన్నారు. అనేక సంస్కరణల చేసి చూపిన ప్రధాని నరేంద్ర మోడీని చాలా మంది మైనార్టి మహిళలు తమ సోదరుడిగా భావిస్తున్నారని అన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు,ముస్లిం మహిళలకు చట్టపరమైన గౌరవం, రక్షణ, పురుషుల నియంత్రణ లేకుండా నేరుగా సంక్షేమ ప్రయోజనాలు, మహిళల పేర్లపై బ్యాంకు ఖాతాలు, గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్లు, ఇళ్లను మంజూరు చేస్తున్నదన్నారు. బీజేపీ ప్రభుత్వం మతభేదం లేకుండా మహిళలను సాధికారత వైపు నడిపిస్తుంటే అసదుద్దీన్ ఓవైసీ మాత్రం సాధికారత మాటలు మాట్లాడుతూనే పార్టీ లోపల, ప్రజాజీవితంలో, ఇళ్లలో కూడా మహిళలపై పరిమితులు విధిస్తున్నారని ఆరోపించారు.

Next Story