కుల రహిత సమాజం కోసం అందరూ కలిసి పని చేయాలి.. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్

by Dishafeatures2 |
కుల రహిత సమాజం కోసం అందరూ కలిసి పని చేయాలి.. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యార్థులకు విషయ పరిజ్ఞానమే ముఖ్యం కాదు.. సమాజ పరిజ్ఞానం ఉండాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఆడిటోరియంలో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నిజాం జాగిర్దార్ జమిందార్ల ఆగడాలను దొడ్డి కొమురయ్య ఎదుర్కొంటే, జ్యోతిరావు పూలే సంస్కరణలకు తొలి గురువు అని పేర్కొన్నారు. సమానత్వం రావాలంటే వర్గ పోరాటాలు తప్పవని, కుల సమాజం పోవాలంటే అందరూ సమానత్వంతో పని చేయాలని సూచించారు. కుల రహిత సమాజం కోసం అందరం కలసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదల కోసం విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తూ ప్రోత్సహిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు. విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధిస్తామనే సంకల్పంతో అంబేద్కర్ ముందుకు సాగారన్నారు. రాజ్యాంగ స్పూర్తితోనే దేశ పరిపాలన కొనసాగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అంబేద్కర్ కృషి ఫలితమే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చింత సాయిలు, ప్రొఫెసర్లు బి.పరమేష్, రమేష్ , బసవరాజు, శ్రీను నాయక్, ప్రభాకర్ రెడ్డి, అజిత్, జ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఐలయ్య, ధీరజ్ ,రేణుక, దుర్గ, రాంరెడ్డి పాల్గొన్నారు.

Next Story

Most Viewed