సీఎం కేసీఆర్‌కు షాక్.. ఆధారాలతో సహా ఆర్బీఐ గవర్నర్‌కు ఫిర్యాదు

by Disha Web Desk |
సీఎం కేసీఆర్‌కు షాక్.. ఆధారాలతో సహా ఆర్బీఐ గవర్నర్‌కు ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై గత కొంత కాలంగా సంచలన ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత బక్క జడ్సన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆయన తెలంగాణ ప్రభుత్వ అక్రమ రుణాలపై ఆర్బీఐ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ వివరాలతో పాటు ఆర్టీఐ ద్వారా సేకరించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లోన్ల వివరాలను ఫిర్యాదుతో పొందుపరిచారు. వివిధ బ్యాంకుల నుంచి ప్రభుత్వం తీసుకున్న లోన్ డీటెయిల్స్ జత పరిచినట్టు బక్క జడ్సన్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఈ ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని బక్క జడ్సన్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే సీబీఐకి సైతం ఫిర్యాదు చేసిన ఆయన తాజాగా ఆర్బీఐ గవర్నర్‌కు కంప్లైంట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

కాగా లైగర్ మూవీ విషయంలో జడ్సన్ ఈడీకీ ఫిర్యాదు ఇవ్వగా ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్ లను ఈడీ విచారించింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రానికి వచ్చిన పెట్టుబడుల అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బక్క జడ్సన్ ఫిర్యాదులు అధికార పార్టీకి రాజకీయంగా ఎలాంటి మజిలీకి తీసుకువెళ్తుందో ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని బీజేపీఅగ్రనేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరోసారి కాళేశ్వరం విషయంలో పొలిటికల్ హీట్ పెరిగినట్టైంది.



Next Story