సిరిసిల్లలో కేటీఆర్‌కు షాక్! క్యాంప్ ఆఫీస్ ఎదుట హై టెన్షన్

by Disha Web Desk 4 |
సిరిసిల్లలో కేటీఆర్‌కు షాక్! క్యాంప్ ఆఫీస్ ఎదుట హై టెన్షన్
X

దిశ, సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సిరిసిల్ల బీజేపీ నేతలు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. క్యాంపు కార్యాలయ ముట్టడిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి బీజేపీ నేతలు నిరసన తెలిపారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.

ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన కేవలం వంద రోజులు మాత్రమే మిగిలి ఉందని, ఎస్సీలకు దళిత బంధు, బీసీలకు బీసీ బంధు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సిరిసిల్ల పట్టణం వర్షాలకు నీట మునిగిందని, మంత్రి కేటీఆర్ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. దళితులకు మూడెకరాల భూమి కాగితాలకే పరిమితమైందన్నారు.

విలీన గ్రామాలను దత్తత తీసుకుంటానని విలీనం చేసుకొని అభివృద్ధి మాత్రం చేయడం లేదన్నారు. కేవలం ప్రధాన రోడ్లను మాత్రం సుందరీకరణ చేసి, పోలీసు పహారాలో మంత్రి తిరుగుతున్నారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిషెట్టి శ్రీనివాస్, ఆవునురి రమాకాంత్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బర్కం నవీన్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడేపు రవీందర్, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ రాష్ట్ర కార్యదర్శి మేకల కమలాకర్, నాయకులు క్రాంతి కుమార్, బుర్ర విష్ణు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed