నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు.. HILT పాలసీపై స్వల్పకాలిక చర్చ

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-05 03:52:40  IST  )

తెలంగాణ శాసనసభ సమావేశాలు నాలుగో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి.

నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు.. HILT పాలసీపై స్వల్పకాలిక చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ సమావేశాలు నాలుగో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) మొదటగా ప్రశ్నోత్తరాలను ప్రారంభించనున్నారు. అనంతరం హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదలాయింపు విధానం (HILT)పాలసీపై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ పాలసీపై ప్రతిపక్షాలు చేస్తున్న భారీ అవినీతి ఆరోపణలను తిప్పికొట్టేందుకు అధికార పక్షం పక్కా వ్యూహంతో సిద్ధమైంది. హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న పాత పారిశ్రామిక వాడలను ఔటర్ రింగ్ రోడ్డు (ORR) అవతలకు తరలించి, ఆ ప్రాంతాలను కాలుష్య రహితంగా మార్చడమే ఈ పాలసీ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. నివాస ప్రాంతాల మధ్య ఉన్న పరిశ్రమల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి, ఆ భూములను వాణిజ్య, నివాస అవసరాలకు వినియోగించుకునేలా ఈ విధానం రూపొందించినట్లుగా అధికార పక్షం నేడు సభలో వివరణ ఇవ్వనుంది.

ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ సన్నద్ధం..

హిల్ట్ (HILT) పాలసీ పేరుతో వేల కోట్ల రూపాయల భూకుంభకోణం జరుగుతోందని, పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) ఆరోపిస్తున్నాయి. అయితే, కృష్ణా జలాల అంశంపై ఇచ్చిన వివరణ తరహాలోనే, ఈ అంశంపై కూడా గణాంకాలతో సహా సమగ్ర వివరణ ఇచ్చి ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భావిస్తున్నారు. అదేవిధంగా నేడు సభ ముందుకు కీలక బిల్లులు రాబోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు బిల్లును, అదేవిధంగా GST సవరణ బిల్లును ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వార్షిక నివేదికలతో పాటు, సమాచార హక్కు చట్టం (RTI) గెజిట్ నోటిఫికేషన్లను ప్రభుత్వం సభ ముందు తీసుకురానుంది.

Next Story