Telangana News: పింఛన్లకు డబ్బుల్లేవ్.. నిధుల కొరతతో ఆలస్యం

by Disha Web Desk 4 |
Telangana News: పింఛన్లకు డబ్బుల్లేవ్.. నిధుల కొరతతో ఆలస్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆసరా పింఛన్లకు నిధులు కరువయ్యాయి. ప్రతినెలా ఈ నిధుల కోసం వెతుకులాట తప్పడం లేదు. ఈ నెల మరింత దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆసరా పింఛన్​దారుల్లో ఎక్కువ శాతం మందు గోళీల కోసం వీటిపైనే ఆధారపడుతున్నారు. ఈ నెల ఖజానాలో నిధులు లేక ఆలస్యమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెండింగ్​ పెట్టి జిల్లాల వారీగా విడుదల చేస్తున్న ప్రభుత్వం.. ఆసరా లబ్దిదారులకు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రతి నెలా మొదటి వారంలో అకౌంట్లలో జమ కావాల్సిన ఆసరా పింఛన్లు రెండు వారాలు గడిచిన ఇవ్వడం లేదు. దీంతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి అవసరాలకు, మందులకు దిక్కులు చూస్తున్నారు. ఆసరా పథకం కింద లబ్ధిదారుల్లో కొందరికి పోస్టాఫీస్ ద్వారా, కొందరికి బ్యాంక్ అకౌంట్ల ద్వారా ప్రభుత్వం పింఛన్​ చెల్లిస్తోంది.

ఖజానాలో కష్టాలు

ఈ నెల ఆసరా అందక పింఛన్‌దారులు ఆగమాగమవుతున్నారు. పింఛన్‌ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియని అయోమయంలో ఉన్నారు. పెన్షన్‌ డబ్బులు వస్తాయన్న ధీమాతో కొడుకులు, కూతుళ్లకు దూరంగా ఉంటున్న వృద్ధులు, వితంతువులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి రోజూ పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే తమకు సమాచారం లేదంటూ సమాధానమిస్తున్నారు.

చెక్కులు రివర్స్​

గడిచిన నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ల కోసం గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు జిల్లాల వారీగా చెక్కులు రెడీ చేసి ట్రెజరీలకు పంపించారు. వాస్తవానికి గతంలో ఏడాదికి సంబంధించిన బడ్జెట్​ను నాలుగు విడుతల్లో విడుదల చేసేవారు. ప్రతి మూడు నెలల డబ్బులు సంబంధిత జిల్లా సమాఖ్య ఖాతాల్లో జమ చేసేవారు. కానీ, గత కొద్ది నెలల నుంచి ప్రతినెలా చెక్కులు చేయాల్సి వస్తోంది. దీంతో మార్చి నెలకు సంబంధించిన చెక్కులు ఈ నెల మొదటివారంలోనే ట్రెజరీలకు పంపించారు. తాజాగా అవన్నీ రివర్స్​ వచ్చాయి. ఫైనాన్స్​ నుంచి నిధులు రాలేదని వాటిని బ్యాంకర్లు తిప్పి పంపించారు.

ఎదురుచూపుల్లో 38 లక్షల మంది

ఆసరా పింఛన్‌ కింద ప్రతి నెలా ఆయా వర్గాలకు ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధ కళాకారులకు రూ. 3016, వృద్దులు, వితంతులు, బీడీ కార్మికులు, బోదకాల బాధితులు, ఎయిడ్స్​ వ్యాదిగ్రస్తులు, నేత, గీత కార్మికులకు రూ. 2,016 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 38.71 లక్షల మందికి ప్రతినెలా ప్రభుత్వం రూ .880 కోట్లు చెల్లిస్తోంది. ప్రభుత్వం నుంచి సకాలంలో ఫండ్స్​రిలీజ్​చేయకపోవడం వల్లే ఈ సమస్య ఎదురవుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు. మార్చి నెల కింద అందాల్సిన పెన్షన్‌ డబ్బుల కోసం రాష్ట్రంలోని 38.71 లక్షల మంది బాధితులు ఎదురు చూస్తున్నారు. దీంతో చిల్లర ఖర్చులకు ఇబ్బంది పడుతున్నామని, రోజూ పోస్ట్‌ ఆఫీస్‌, బ్యాంకులు, పంచాయతీ కార్యాలయాలకు వచ్చి పోతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లను అడిగితే రేపు మాపంటున్నారని, ఇంతకు ముందు ఆరో తారీఖు ఇచ్చేవారని, ఇప్పుడు రెండు వారాలు అవుతున్నా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed