ఓటరు జాబితా ప్రక్షాళన..మ్యాపింగ్ 68 శాతం పూర్తి

by velandi.Saikiran |

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా ఇప్పటివరకు 68శాతం మ్యాపింగ్​పూర్తయింది.

ఓటరు జాబితా ప్రక్షాళన..మ్యాపింగ్ 68 శాతం పూర్తి
X

మ్యాపింగ్ 68 శాతం పూర్తి

- హైదరాబాద్‌లో 45 శాతం

- నేడు ‘సర్’పై ఈసీఐ అధికారుల సమీక్ష

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా ఇప్పటివరకు 68శాతం మ్యాపింగ్​పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతానికి పైగా మ్యాపింగ్​ పూర్తి కాగా హైదరాబాద్‌లో మాత్రం ఇప్పటివరకు 45 శాతం మాత్రమే మ్యాపింగ్​అయినట్లుగా అధికారులు లెక్కలు చెబుతున్నారు. మ్యాపింగ్ విషయంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఓటర్లందరు పూర్తిగా సహకరిస్తుండగా పట్టణ ప్రాంతాల్లోని వారికి ‘సర్‌’పై అవగాహన లేకపోవడం, రెండుచోట్ల ఓట్లు ఉండటం, చనిపోయిన వారు, వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి కూలీ పనుల కోసం తాత్కాలికంగా వచ్చినవారి నుంచి సమాచారం ఇవ్వకపోవడంతో మ్యాపింగ్​పూర్తి కావడంలేదని తెలిసింది. దీంతో హైదరాబాద్‌లో 50 శాతం లోపే మ్యాపింగ్​ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో మిగిలినవారి ఓట్లపై అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణాల్లో పకడ్బందీగా ‘సర్‌’ను నిర్వహించాలని, అదే సమయంలో సమయంలో అర్హులైనవారి ఓట్లు పోకుండా చూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం హైదరాబాద్ రానున్నారు. సర్‌పై రాష్ట్రంలో ఏవిధంగా ఏర్పాట్లు చేశారు?, ఎంతవరకు మ్యాపింగ్​పూర్తి చేశారు?, బీఎల్‌ఓలు, బీఎల్ఏల నియామకాలు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోల పోస్టులు ఖాళీ లేకుండా చూడటం, రాజకీయ పార్టీలతో సమావేశాలు తదితర అంశాలపై అధికారులు సమీక్షించనున్నారు.

హైదరాబాద్‌లోనే ఎక్కువ..

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రక్షాళనపై రాజకీయ పార్టీలు ఇప్పటికే అప్రమత్తం అయ్యాయి. బీఎల్‌ఏలను నియమించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇంచార్జిలను సైతం ఏర్పాటు చేసుకున్నారు. అర్హులైన ఓటర్లు జాబితాలో ఉండేవిధంగా చూడటానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా చనిపోయినవారు, డూప్లికేట్, వేరేప్రాంతాలకు వెళ్లినవారు, వేరే ప్రాంతాల నుంచి వచ్చినవారు ఉన్నారని గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచే అత్యధిక ఓట్లు తొలగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Next Story