సింగరేణి మ‌రో అద్భుతం..కేంద్రం ప్రశంస

by velandi.Saikiran |   (  Updated:2026-06-10 23:00:26  IST  )

singareni coal
X

singareni coal

దిశ, తెలంగాణ బ్యూరో/గోదావరిఖని/కొత్తగూడెం సింగరేణి: గనుల నిర్వహణలోనే కాదు.. గని మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ సింగరేణి ఆదర్శంగా నిలిచింది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ-2 ఓపెన్‌కాస్ట్ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా, గని ప్రారంభ సమయంలో ఎస్క్రో డిపాజిట్‌గా జమ చేసిన సొమ్మును వడ్డీతో సహా సుమారు రూ.40 కోట్ల మేరకు కేంద్రంలోని కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (సీసీఓ) తిరిగి చెల్లించింది. గని తవ్వకాల అనంతరం భూసంరక్షణ, అటవీకరణ, గాలి-నీటి కాలుష్య నియంత్రణ, భద్రతా చర్యలు వంటి అన్ని పర్యావరణ ప్రమాణాలను సింగరేణి పూర్తిస్థాయిలో అమలు చేసినట్లు థర్డ్ పార్టీ ఆడిట్‌లో నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

డోర్లీ-2 గనిలో 162 హెక్టార్లకు పైగా అటవీకరణ చేపట్టడంతో పాటు కాలుష్య నియంత్రణ, జల సంరక్షణ చర్యలను సమర్థంగా అమలు చేసింది. ఇప్పటికే డిపాజిట్‌లో 90 శాతం మొత్తాన్ని విడుదల చేసిన సీసీఓ... మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలో చెల్లించనుంది. ఇదే తరహాలో డోర్లీ-1 గని మూసివేత పనుల తనిఖీలు చివరి దశలో ఉండటంతో మరో రూ.60 కోట్లకు పైగా డిపాజిట్ సింగరేణికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. సుస్థిర మైనింగ్, పర్యావరణ బాధ్యతల అమలులో సింగరేణి సాధించిన మరో ముఖ్యమైన విజయంగా దీనిని భావిస్తున్నారు.

సింగరేణి సాధించిన విజయమిది.

-162.517 హెక్టార్ల విస్తీర్ణంలో గతంలో ఉన్నట్టే దట్టమైన అడవులను తిరిగి పెంచారు.

-గని తవ్వకానికి ముందు సేకరించిన 19.76 లక్షల క్యూబిక్ మీటర్ల పైపొర మట్టిని జాగ్రత్తగా భద్రపరిచి, గని మూసివేత తర్వాత తిరిగి వాడి మొక్కలను నాటారు.

-డ్రిల్లింగ్ సమయంలో డస్ట్ కలెక్టర్లు, వాటర్ స్ప్రింక్లర్లు, సీహెచ్‌పీల వద్ద మిస్ట్ స్ప్రేయర్లను ఏర్పాటు చేసి ధూళిని సమర్థవంతంగా అరికట్టారు.

-గని చుట్టూ 10 కి.మీ మేర గార్ల్యాండ్ డ్రైనేజీలు, చెక్ డ్యామ్‌లు, సెటిలింగ్ ట్యాంకులను నిర్మించి జల కాలుష్యాన్ని పూర్తిగా నివారించారు.

Next Story