ఓయూ నుంచి మరో ఎమ్మెల్యే.. చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం విజయం

by Disha Web Desk 2 |
ఓయూ నుంచి మరో ఎమ్మెల్యే.. చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం విజయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతల్లో మరో వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చొప్పదండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేడిపల్లి సత్యం గెలుపొందారు. దీంతో విద్యార్థి నేత నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగిన లీడర్ల లిస్టులో మరో పేరు ఎక్కింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బల్కా సుమన్, గాదరి కిషోర్‌లు విద్యార్థి నేతల నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వీళ్లిద్దరూ ఓటమీ పాలయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మేడిపల్లి సత్యం విజయం సాధించి ఓయూ స్టూడెంట్‌ కేటగిరీ నుంచి శాసనసభ్యుడిగా గుర్తింపు పొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జన్మించిన మేడిపల్లి సత్యం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్ విభాగంలో ఎంఏ పీహెచ్ డీ పూర్తి చేశారు. చిన్నతనం నుంచే ఎంతో సామాజిక, సేవా భావం గుణాలు కలిగిన మేడిపల్లి సత్యం ప్రజలకు సేవ చేయడానికి భవిష్యత్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. దీంతో విద్యార్థి దశ నుంచే విద్యార్థి సంఘాలలో చురుగ్గా పనిచేస్తూ సమాజాన్ని అత్యంత దగ్గరగా పరిశీలించారు.

ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న సత్యం, కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీలో కార్యకర్త స్థాయి నుండి ఎమ్మెల్యే అభ్యర్థి వరకు అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2018లో చొప్పదండి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరి కొంతకాలం కొనసాగినప్పటికీ.. ఆ పార్టీ విధానాలు నచ్చక మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సత్యం పనితీరును గమనించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు చొప్పదండి నుంచి టిక్కెట్‌ను కేటాయించగా, విజయం సాధించారు. టీపీసీసీ అధ్యక్షుడు, కాబోయే సీఎం రేవంత్ రెడ్డికి మేడిపల్లి సత్యం అతి దగ్గర వ్యక్తి. గత కొన్ని ఏళ్లుగా రేవంత్ రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడూ ప్రశ్నిస్తూ గుర్తింపు పొందారు.



Next Story

Most Viewed