నేడే ఏపీ బీఆర్ఎస్ ఆఫీస్‌ ఓపెనింగ్.. గులాబీ బాస్ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ!

by Disha Web Desk 2 |
నేడే ఏపీ బీఆర్ఎస్ ఆఫీస్‌ ఓపెనింగ్.. గులాబీ బాస్ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పార్టీ పేరును మార్చిన తర్వాత అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టలేదు. మహారాష్ట్రపై ఎక్కువ ఫోకస్ పెట్టినా ఏపీని మాత్రం లైట్‌గా తీసుకున్నారని ఆ పార్టీ నేతల నుంచే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో పార్టీ సెంట్రల్ ఆఫీస్‌ను ఓపెన్ చేసినా ఇతర రాష్ట్రాల్లో యాక్టివిటీస్‌ స్పీడప్ కాలేదు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్‌ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. పార్టీ జాతీయ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా ఆఫీసు ప్రారంభోత్సవం చేయించాలని ఆ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖరరావు భావించారు. గుంటూరు టౌన్‌లో ఐదంతస్తుల భవనాన్ని లీజుకు తీసుకుని ఆదివారం ఉదయం 11.35 గంటలకు ప్రారంభోత్సవం జరిగేలా షెడ్యూలు తయారైంది. కానీ కేసీఆర్ పర్యటన ఇంకా ఫైనల్ కాలేదు. దాదాపు వెళ్ళే అవకాశాలు లేవని హైదరాబాద్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీని విస్తృతం చేయడానికి ఆ రాష్ట్రానికి మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ను అధ్యక్షుడిగా నియమించినా ఇప్పటివరకు బహిరంగసభలను నిర్వహించలేదు. ఏప్రిల్ నెల చివర్లోనే విశాఖ వేదికగా భారీ బహిరంగ సభ పెట్టడానికి ఆ రాష్ట్ర నాయకత్వం సన్నాహాలు చేసింది. కానీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు పార్టీ ఆఫీస్‌ను నెలకొల్పింది. లాంఛనంగా కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని భావించినా ఆయన హాజరుపై స్పష్టత లేకపోవడంతో ఆ రాష్ట్ర అధ్యక్షుడే ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ ఎందుకు పర్యటించడంలేదన్న ప్రశ్నలు గతలోనే వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరిగిన సమయంలో కేసీఆర్ చేసిన కామెంట్లే ఇప్పుడు ఆయనకు రివర్స్ కొడతాయన్న ఆందోళనే కారణమై ఉంటుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న ఆంధ్ర రాజకీయ నాయకులకు కౌంటర్ ఇచ్చే సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నాయకులు, కొన్ని సందర్భాల్లో కేసీఆర్ కూడా పరుష పదజాలంతో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని లాంఛనంగా ప్రకటించిన తర్వాత ఆంధ్ర ప్రజల నుంచి కేసీఆర్ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎంటర్ అవుతుందో చూస్తామంటూ కామెంట్ చేసి కేసీఆర్‌పైన రకరకాల కామెంట్లు చేశారు. ఉద్యమం సమయంలో వాడిన పదజాలాన్ని తాము మర్చిపోలేదని, ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా చేసిన కామెంట్లు ఇంకా గుర్తున్నాయని ఉదహరించారు. బీఆర్ఎస్ తరఫున ఎవరు నిలబడినా తగిన బుద్ధి చెప్తామంటూ సామాన్య ప్రజానీకం సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లీడర్లెవరూ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్‌లో ఏపీలో అడుగు పెట్టలేదు.

స్టేట్ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా కేసీఆర్ వెళ్తే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో అనే అనుమానాలు కూడా గులాబీ నేతల్లో లేకపోలేదు. కేసీఆర్ హాజరుకావడం ద్వారా ఏపీలో పార్టీ కార్యకలాపాలకు ఊపు వస్తుందని అక్కడి నాయకులు, శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. కానీ కేసీఆర్ టూర్ ఫిక్స్ కాకపోవడం వారికి నిరాశ కలిగించింది. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఏ మేరకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఆఫీస్ ఓపెనింగ్‌కు హాజరైన తర్వాత భవిష్యత్తులో పార్టీ బహిరంగసభల్లో పాల్గొనాల్సి వస్తుందని, కానీ ఓటింగ్ పర్సెంటేజీ రాకపోతే అది అవమానంగా ఉంటుందని, వ్యక్తిగతంగా ఆయన చరిష్మా పనిచేయలేదనే అపవాదును మూటగట్టుకోవాల్సి ఉంటుందని, ఈ కారణంగానే ఇప్పుడు హాజరు కాకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణతో పాటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా అభివృద్ధిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ వెనకబడిందని, కేసీఆర్ ద్వారా మాత్రమే రాష్ట్రం డెవలప్ కావడం సాధ్యమంటూ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఇటీవల వ్యాఖ్యానించారు. పార్టీ స్టేట్ ఆఫీస్ ఓపెనింగ్ తర్వాత కార్యకలాపాలు ఊపందుకుంటాయన్నారు. కేసీఆర్ వస్తారనే భావిస్తున్నామంటూనే రాకపోయినా ఆఫీస్ ప్రారంభోత్సవం యధావిధిగా ఉంటుందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో పార్టీ ఆఫీస్‌ను ఓపెన్ చేయడంతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చి చేరినవారికి రెండు రోజుల శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. నెల రోజుల్లో సభ్యత్వ నమోదు పూర్తి చేయాలన్న ఆదేశాలతో పాటు బాధ్యులకు ట్యాబ్‌లను, మెంబర్‌షిప్ పుస్తకాలను కూడా అందజేశారు.

మహారాష్ట్రలో పార్టీ విస్తరణపై కేసీఆర్ సీరియస్ ఫోకస్ పెట్టినా ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ఆచితూచి అడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని కేసీఆర్ తప్పుపట్టారు. కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన టెండర్లలో సింగరేణ సంస్థ తరఫున పాల్గొంటామని హామీ ఇచ్చినా ఆచరణలో మాత్రం వెనక్కు తగ్గారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేసీఆర్‌తో మాత్రమే సాధ్యమంటూ అక్కడి నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నా ఆ రాష్ట్రంలో పర్యటించడానికి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

ఐదంతస్తుల భవనంలో కింది అంతస్తు పార్కింగ్‌, ఆఫీస్ వ్యవహారాలకు పరిమితమైంది. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు మాత్రం కాన్ఫరెన్సు హాళ్ళకు రిజర్వు అయ్యాయి. మూడవ, నాల్గవ అంతస్తుల్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యుల ఛాంబర్లు, జిల్లా వ్యవహారాలను చూసే సమన్వయకర్తలకు కేటాయింపులు జరిగాయి. ఐదో అంతస్తులో రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ సూట్‌తో పాటు ముఖ్యులతో మాట్లాడే మీటింగ్ హాల్స్ ఏర్పాటయ్యాయి. మొత్తం భవనంలో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే నేతలకు గెస్టు హౌజ్‌లు కూడా ఒక్కో ఫ్లోర్‌లో కొన్ని చొప్పున మొత్తం 16 రూమ్‌లు ఉన్నాయి.


Next Story

Most Viewed