గులాబీ నోట్లన్నీ వారి వద్దే.. బ్యాంకుల దగ్గర ‘నో’ పబ్లిక్

by Disha Web Desk 4 |
గులాబీ నోట్లన్నీ వారి వద్దే.. బ్యాంకుల దగ్గర ‘నో’ పబ్లిక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెండువేల నోట్ల మార్పిడి మంగళవారం నుంచి ప్రారంభమైంది. ప్రజలు భారీ సంఖ్యలో వస్తారనుకొని బ్యాంకులు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాయి. స్థానిక పోలీసుల సాయాన్ని సైతం కోరాయి. అయితే బ్యాంకుల్లో నోట్లు మార్చుకోవడానికి ఆశించిన స్పందన రాలేదు. అదే సమయంలో జ్యువెలరీ షాపుల్లో రోజువారీ కంటే రెట్టింపు స్థాయిలో గిరాకీ అయినట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనూ పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. దీంతో సంపన్నులు, అక్రమార్కుల దగ్గరే గులాబీ నోట్లు పేరుకుపోయాయనే ప్రచారం జరుగుతున్నది.

బ్యాంకుల వద్ద అంతంతే..

ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నా కేవలం వందల సంఖ్యలో మాత్రమే జనం వచ్చారని హైదరాబాద్‌లోని పలు బ్యాంకుల మేనేజర్లు తెలిపారు. సామాన్యుల దగ్గర రెండు వేల నోట్లు పెద్దగా లేవనేది స్పష్టమైందని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అయితే సామాన్యులు కూడా నోట్లను వెంటనే మార్చుకోవాలన్న తొందర భావనతో లేరని, సెప్టెంబరు 30 వరకూ గడువు ఉండడంతో హడావిడి పడడంలేదని నల్లకుంటలోని ప్రైవేటు బ్యాంకు మేనేజర్ ఒకరు తెలిపారు. అకౌంట్‌లలో డిపాజిట్ చేసుకునేవారి సంఖ్య కూడా తాము అశించినంతగా లేదన్నారు.

నగల దుకాణాల వద్ద క్యూ

పంజాగుట్ట, బంజారాహిల్స్, బేగంపేట్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లోని జువెల్లరీ షాపుల్లో రోజు వారి కంటే రెట్టింపు స్థాయిలో బంగారం విక్రయాలు జరిగినట్లు సమాచారం. ఇక్కడ జరిగిన మొత్తం విక్రయాల్లో దాదాపు సగం మేర రూ. 2వేల నోట్లతోనే జరిగినట్లు పంజాగుట్టలోని ఆర్గనైజ్డ్ జువెల్లరీ వ్యాపారి ఒకరు తెలిపారు. సికింద్రాబాద్‌లోని అన్ ఆర్గనైజ్డ్ దుకాణాల్లో భారీ స్థాయిలోనే రూ.2వేల నోట్లతో వ్యాపారం జరిగినట్లు తేలింది. రెండు లక్షల రూపాయల వరకు బంగారం కొనుగోళ్లకు ‘పాన్’ ఆధార్ కార్డు లాంటివి అవసరం లేకపోవడంతో చిల్లరగానే బిజినెస్ జరిగినట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. దీంతో సంపన్నుల దగ్గర పోగుబడిన నోట్లు నగల దుకాణాలకు చేరుతున్నట్లు అర్థమవుతున్నది.

రియల్ ఎస్టేట్ లోనూ..

సిటీ శివారు ప్రాంతాల్లోని భూముల కొనుగోళ్లకు కూడా రూ.2వేల నోట్లను వాడినట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సూచనప్రాయంగా తెలిపారు. రాబోయే నాలుగు నెలల వరకూ రియల్ బిజినెస్ ఈ నోట్ల కారణంగా ఒక మేరకు కంటిన్యూ అయ్యే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు ఆన్‌లైన్ కామర్స్ వ్యాపారంలో ‘క్యాష్ ఆన్ డెలివరీ’ ఆప్షన్‌ను ఎంచుకునేవారి సంఖ్య పెరిగింది. రూ. 2వేల నోట్లతోనే ఎక్కువ పేమెంట్లు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. మొత్తం క్యాష్ డెలివరీ లావాదేవీల్లో 75% మేర రెండు వేల నోట్లే వస్తున్నాయని ఫుడ్ డెలియరీ యాప్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పెట్రోల్ బంకుల్లోనూ రూ. 2వేల నోట్లు ఇచ్చి పెట్రోల్ పోసుకునే వారి సంఖ్య పెరిగిందని హిమాయత్‌నగర్‌లోని భారత్ పెట్రోలు బంకు మేనేజర్ ఒకరు తెలిపారు.

డిపాజిట్లు, ఎక్స్‌చేంజ్ ఎక్కువగా జరగలే

మార్కెట్‌లో సుమారు రూ. 3.76 లక్షల కోట్ల మేర రూ.2వేల నోట్లు చెలామణిలో ఉన్నట్లు రిజర్వు బ్యాంకు ఈ నెల 19న ప్రకటించింది. ఇప్పటివరకు ఏ మేరకు బ్యాంకులకు చేరాయన్న గణాంకాలను వెల్లడించకపోయినప్పటికీ ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నయ్, హైదరాబాద్ లాంటి నగరాల్లో పెద్దగా డిపాజిట్లు, ఎక్స్ చేంజ్ జరగలేదనే వార్తలు వెలువడ్డాయి. జువెల్లరీ, రియల్ బిజినెస్ లావాదేవీల్లో గులాబీ నోట్లే ఎక్కువగా కనిపిస్తుండడంతో సంపన్నులు నోట్ల మార్పిడి కోసం ఈ బాటను ఎంచుకున్నట్లు స్పష్టమవుతున్నది.

Next Story

Most Viewed