అందరి కన్ను దానిపైనే.. T - కాంగ్రెస్‌లో మళ్లీ మొదలైన వార్

by Disha Web Desk 4 |
అందరి కన్ను దానిపైనే.. T - కాంగ్రెస్‌లో మళ్లీ మొదలైన వార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ అంటేనే వర్గ పోరు.. నేతల బలప్రదర్శనలు. ఆ పార్టీలోని సీనియర్లదంతా ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లు రాజకీయం. ఒక మాటలో చెప్పాలంటే ఎవరి పాదయాత్రలు వారివే.. ఎవరి బహిరంగ సభలు వారివే.. ఎవరి సమావేశాలు వారివే. నిన్నా మొన్నటి వరకు ఈ రకమైన బలప్రదర్శనలు చేసిన నేతలంతా ఇప్పుడు కొత్తగా ఓ రాగాన్ని ఎంచుకున్నారు. అదే సీఎం సీటు. కర్ణాటక ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జోష్ లో ఉంది.

రాష్ట్ర ముఖ్య కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడా అవే ఫలితాలు రిపీట్ అవుతాయనే ధీమాతో ఉన్నారు. దీంతో ఇప్పుడు ముఖ్యనేతల కన్నంతా సీఎం సీటుపై పడింది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న లీడర్లంతా ఇప్పుడు హైకమాండ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. చాలాకాలం పాటు గాంధీభవన్ కు సైతం దూరంగా ఉన్న వీరంతా.. ఇప్పుడు పార్టీ మీటింగ్ లు, రివ్యూలు, సమీక్షల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం గాంధీభవన్ వేదికగా ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది.

నేనంటే నేను..

కాంగ్రెస్​పార్టీలో మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి సీనియర్. తన రాజకీయ జీవితం చివరి దశకు వచ్చిందని, రాబోయే ఎన్నికల్లో తన కొడుకును రంగంలోకి దించుతానని గతంలో ప్రకటించారు. కానీ.. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన గాంధీభవన్‌లో ప్రత్యక్షమయ్యారు. ఇక పీసీసీ మాజీ చీఫ్​పొన్నాల లక్ష్మయ్య కొత్త పీసీసీ చీఫ్‌గా రేవంత్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు. ఆయన కూడా కర్ణాటక ఎన్నికల రిజల్ట్స్​తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చి మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇక నిత్యం హాట్ కామెంట్లు చేసే కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సీఎం రేసులో ఉన్నాననే సంకేతాన్ని తన పుట్టిన రోజు సందర్భంగా పరోక్షంగా ఇచ్చారు.

కర్ణాటకలో పార్టీ కోసం డీకే శివకుమార్ కష్టపడినా.. సిద్ధరామయ్యనే హైకమాండ్ సీఎంను చేసిందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. దీని బట్టి భవిష్యత్‌లో తెలంగాణలో పీసీసీ చీఫ్ కష్టబడి పార్టీని గెలిపించినా.. సీనియర్​కాంగ్రెస్​నేతలకే సీఎం కుర్చీ అనే విషయాన్ని వెంకట్​రెడ్డి ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక భట్టి విక్రమార్క కూడా తన దైన శైలీలో పబ్లిక్‌లో మార్క్‌ను చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాదయాత్రలు చేస్తూ సీఎం అభ్యర్ధిని తానే అనే స్థాయిలో పబ్లిక్‌కు ఇండికేషన్​ఇస్తున్నారు. వీళ్లే కాకుండా మరి కొంత మంది నేతలు కూడా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.

హై కమాండ్​ ఫోకస్‌తో..

హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్​విజయం సాధించడంతో నెక్ట్స్​టార్గెట్ తెలంగాణనే అని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటున్నది. ఢిల్లీ నుంచి గల్లీ లీడర్​వరకు ప్రజలకు ఇదే వివరిస్తున్నారు. దీంతో ఢిల్లీ అధిష్టానం కూడా రాష్ట్రంపై ఫోకస్​పెట్టింది. ప్రియాంక గాంధీ కూడా ప్రతినెలా రెండు సార్లు విజిట్ చేయనున్నట్లు ఏఐసీసీ పేర్కొనడంతో ఇప్పుడు సీనియర్లంతా మళ్లీ యాక్టివ్​అయ్యారు. మళ్లీ ప్రజల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. ఎన్నికలు రాకముందే నేతలు ఇలా సీఎం కుర్చీ కోసం ట్రై చేస్తుండటంతో పార్టీ హైకమాండ్ కూడా ఈ అంశాన్ని సీరియస్​గా మానిటరింగ్ చేస్తున్నది.

రేవంత్ మార్క్..

టీపీసీసీ అధ్యక్షుడి పగ్గాలు రేవంత్ రెడ్డి చేతికి వచ్చినప్పటి నుంచి పార్టీలో జోష్​పెరిగిందనేది వాస్తవం. పార్టీని నిలపెట్టేందుకు ఆయన పాదయాత్రలు, సభలు, సమావేశాలు, మీటింగ్‌లు పెడుతూ కార్యకర్తలకు భరోసా ఇస్తూ వస్తున్నారు. గతంతో పోల్చితే కాంగ్రెస్​పార్టీలో అర్బన్‌తో పాటు రూరల్‌లోనూ మరింత బలోపేతం అయింది. ఇదంతా రేవంత్ రెడ్డి కృషి అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గాంధీభవన్‌కు కూడా రేవంత్ బాధ్యతలు తర్వాత కొత్త కళ వచ్చిందని పలువురు కార్యకర్తలు చెబుతున్నారు. అయితే.. పార్టీ కోసం ఇంత కష్టపడుతున్న ఆయన సీఎం కుర్చీ ఆశించడంలో తప్పులేదని రేవంత్ వర్గం వెల్లడిస్తున్నది.

Next Story

Most Viewed